మళ్లీ చంద్రబాబు మోసం.. ఉచిత ఇసుక ఒట్టిదే! | ysrcp leader TJR Sudhakar babu fires on cm chandrababu over sand free policy | Sakshi
Sakshi News home page

మళ్లీ చంద్రబాబు మోసం.. ఉచిత ఇసుక ఒట్టిదే!

Jul 9 2024 2:46 PM | Updated on Jul 9 2024 3:11 PM

ysrcp leader TJR Sudhakar babu fires on cm chandrababu over sand free policy

గుంటూరు, సాక్షి: ఏపీలో ఉచిత ఇసుక పంపిణీ అంతా ఉత్తిదేనని తేలిపోయిందని వైఎ​స్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు అన్నారు. ఆయన మంగళవారం ఏపీ సర్కార్‌ చేస్తున్న మోసంపై మాట్లాడారు.

 ‘‘ చంద్రబాబు మరోసారి ప్రజలను మోసం చేశారు. స్టాక్ యార్డుల దగ్గర ప్రభుత్వమే రేట్లు వివరిస్తూ ఫ్లెక్సీలు పెట్టింది. దీన్ని ఉచిత ఇసుక అంటారా?. రీచ్‌ల దగ్గర వసూలు చేసే డబ్బంతా ఎవరి దగ్గర ఉంచుతోంది?. గతంలో రూ.750 కోట్లు ప్రభుత్వానికి వచ్చింది. ఇప్పుడు ఆ డబ్బంతా టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్తోంది?. 2014-19 మధ్య చేసిన అక్రమాలే మళ్ళీ ఇసుక పేరుతో చేస్తున్నారు. 

.. కూటమి ప్రభుత్వం ఇప్పుడు విక్రయించిన రేట్లకే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కూడా విక్రయించింది. దాని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. మరి ఇప్పుడు చంద్రబాబు ఉచితం అని చేస్తున్నదేమిటి?. చంద్రబాబు ఎన్నికల హామీలు, అధికారంలోకి వచ్చాక చేసే పనులకూ ఎప్పుడూ పొంతన ఉండదు. ఇచ్చిన హామీలు తుంగలో తొక్కటం అనేది చంద్రబాబుకు సహజ నైజం. 

.. ప్రజలను నిలువునా ముంచటంలో చంద్రబాబుకు తిరుగులేదు. వర్షాకాలంలో ఇసుక తెచ్చుకోలేమని వైఎస్‌ జగన్ ప్రభుత్వం గతంలో ముందుగానే నిల్వ చేసింది. ఆ నిల్వలన్నీ ఇప్పుడు ఏమయ్యాయి?. 80 లక్షల టన్నుల ఇసుక స్టాక్ యార్డుల్లో ఉంది. ఇప్పుడు 35 లక్షల టన్నుల ఇసుకే ఉన్నట్టు రికార్డుల్లో చూపించారు. అంటే మిగతా ఇసుక ఎవరి జేబుల్లోకి డబ్బుగా మారింది?. దీనిపై చట్ట ప్రకారం విచారణ జరపాలి.

..2014 -16 మధ్య ఇసుక మీద ఏకంగా నాలుగు జీవోలు ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. ఇసుక విధానం పేరుతో ప్రకృతి వనరుల దోపిడీ చేస్తున్నారని హైకోర్టు కూడా హెచ్చరించింది. గ్రీన్ ట్రిబ్యునల్ సైతం తప్పు పట్టింది. ఇది నిజమో కాదో చంద్రబాబు చెప్పాలి. జనానికి అవసరమైన ఇసుకని ఉచితం చేయాలి. ఎక్కడా డబ్బు వసూలు చేయవద్దని కోరుతున్నాం’ అని డిమాండ్‌ చేశారు.

35 లక్షల టన్నుల ఇసుక మాయం..

Advertisement
 
Advertisement
Advertisement