సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ స్కాంపై లోకేష్ సవాళ్లు.. ఉత్తర కుమార ప్రగల్భాలు లాంటివని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఇవాళ (బుధవారం) రాత్రి ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. డీఎస్సీ స్కాం బయటపెట్టి చాలా రోజులు అయ్యిందని.. స్కాం జరిగిన తీరును ఆధారాల సహా బయటపెట్టామన్నారు. డీఎస్సీ డార్క్ ఆపరేషన్ను తమ నాయకుడు వైఎస్ జగన్ సమగ్రంగా ప్రజలముందు పెట్టారని.. ప్రతి పాయింటుకూ ఆధారాలు చూపారని పేర్ని నాని వివరించారు.
కానీ.. ఇవ్వాళ్టికీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ సమాధానాలు చెప్పడానికి ముందుకు రాలేదన్నారు. స్కాంపై మేం ప్రస్తావించిన అంశాలపై వివరణ ఇవ్వకుండా తప్పించుకుంటున్నారంటూ పేర్ని నాని దుయ్యబట్టారు. ఇప్పుడు సవాల్ అంటూ లోకేష్ పబ్లిసిటీ గిమ్మిక్కులు చేస్తున్నారు. అంత దమ్మే ఉంటే వైఎస్ జగన్ ప్రస్తావించిన అంశాలపై మీడియా ముఖంగా చంద్రబాబు, లోకేష్లు సమాధానాలు చెప్పొచ్చుగా?’’ అంటూ ఆయన పేర్ని నాని నిలదీశారు.
ముఖ్యమంత్రి పదవులు నిర్వహించిన చంద్రబాబు, వైఎస్ జగన్ మధ్య దీనిపై చర్చ కోరినా ఒక అర్థం ఉంటుంది. ముఖ్యమంత్రి హోదా స్థాయిలో పనిచేసిన వైఎస్ జగన్కు చర్చకు రావాలంటూ మంత్రిస్థాయిలో ఉన్న లోకేష్ పిలవడం అర్థరహితం. రాష్ట్రానికి మంత్రిగా లోకేష్తో సమాన స్థాయిలో నేనుకూడా పనిచేశాను. లోకేష్ స్థాయి, నా స్థాయి ఒక్కటే. డీఎస్సీపై చర్చకు ఇద్దరం సమ ఉజ్జీలమే. డీఎస్సీ స్కాంపై లోకేష్తో చర్చకు నేను రెడీ. టైము, తేదీ, ప్లేస్ లోకేష్ చెప్పినా, నన్ను చెప్పమన్నా సరే. డీఎస్సీపై నాతో చర్చకు లోకేష్ సిద్ధమా?. లోకేష్ సమాధానం కోసం ఎదురుచూస్తున్నాను. ఈలోగా డీఎస్సీ స్కాంపై మరోసారి మా ప్రశ్నలను గుర్తు చేస్తున్నాను’’ అని పేర్ని నాని పేర్కొన్నారు.


