
- లోపభూయిష్టంగా పోలవరం నిర్మాణం
- అంతర్జాతీయ నిపుణుల పరిశీలనలో బయటపడ్డ డొల్లతనం
- చంద్రబాబు అవినీతికి పరాకాష్టగా నాసిరకం పనులు
- నిపుణుల హెచ్చరికలను పట్టించుకోకపోతే పోలవరం ప్రాజెక్టే ప్రశ్నార్థకం
- డయాఫ్రం వాల్ డిజైన్లను మార్చేశారు
- కాంక్రీట్ నాణ్యతలోనూ రాజీ
- ఇదే కొనసాగితే ప్రాజెక్ట్ ఉనికికే ప్రమాదం
- వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్
రాజమహేంద్రవరం: కమీషన్ల కక్కుర్తితో పోలవరం ప్రాజెక్ట్ను సీఎం చంద్రబాబు సర్వనాశనం చేస్తున్నాడని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి మార్గాని భరత్ మండిపడ్డారు. రాజమహేంద్రవరం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జరుగుతున్న అవకతవకలను తాజాగా ప్రాజెక్ట్ను పరిశీలించిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ తన నివేదికలో బయటపెట్టిందని అన్నారు.
సీడబ్ల్యుసీ ఆమోదించిన దానికి భిన్నంగా డయాఫ్రం వాల్ డిజైన్లు, కాంక్రీట్ నాణ్యతలో ప్రమాణాలు లేకపోవడం, లోపభూయిష్టమైన విధానాలతో మొత్తం ప్రాజెక్ట్నే ప్రమాదంలోకి నెట్టేట్టుగా కూటమి సర్కార్ వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల జీవనాడి పోలవరంపై ప్రభుత్వం మొద్దునిద్ర వీడి, అంతర్జాతీయ నిపుణుల కమిటీ చేసిన సిఫారస్ల మేరకు ప్రాజెక్ట్ను ముందుకు తీసుకువెళ్ళాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే....
చంద్రబాబు సీఎం అయ్యాక గతంలో చేసిన తప్పులనే మళ్ళీ పునరావృతం చేస్తూ పోలవరం ప్రాజెక్టును ప్రశ్నార్థకం చేస్తున్నారు. గతంలో చేసిన తప్పుల నుంచి ఇప్పటికీ కూటమి ప్రభుత్వం పాఠాలు నేర్చుకోకుండా కమీషన్ల కక్కుర్తితో రూ.990 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోంది. గతంలో సబ్ కాంట్రాక్టు పనులు చేసే బావర్స్ కంపెనీకి నేరుగా డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు అప్పగించేశారు.
దీంతో పనుల్లో జాప్యం, నాణ్యతాలోపం కొట్టొచ్చినట్టు కనపడుతోందని అంతర్జాతీయ నిపుణుల కమిటీ తాజాగా పీపీఏ, సీడబ్ల్యూసీలకు ఇచ్చిన ఒక నివేదికలో వెల్లడించింది. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ను తుంగలో తొక్కి 1.5 మీటర్ల మందంతో కాకుండా 0.9 మీటర్ల మందంతో బావర్ సంస్థ డయా ఫ్రం వాల్ పనులు చేస్తోందని అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఎత్తిచూపింది. సీడబ్ల్యూసీ ఆమోదించిన మందం కంటే 0.6 మీటర్లు మందం తగ్గించి పనులు చేస్తున్నారని తప్పుపట్టింది. కాంక్రీట్ మందం సగానికి సగం తగ్గించేసినట్టు నిపుణుల కమిటీ తన నివేదికలో బట్టబయలు చేసింది. రాబోయే రోజుల్లో 190 టీఎంసీల నీటిని నిల్వచేసే పోలవరం ప్రాజెక్టుకు ఏదైనా జరిగితే ఉభయ గోదావరి జిల్లాలు కూడా తుడిచిపెట్టుకుని పోయే ప్రమాదం ఉంది. ఇది ముమ్మాటికీ క్షమించరాని నేరం. పునర్ నిర్మాణం చేసే పనుల్లో కూడా కనీస బాధ్యత తీసుకోవడం లేదు.
నిపుణుల పరిశీలనతో బయటపడ్డ డొల్లతనం
పోలవరం ప్రాజెక్టు పనుల్లో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి ఏడాది క్రితం సియాన్ హించ్బెర్గర్, మెస్సర్స్ సీ రిచర్డ్ డొన్నెళ్లి, గియానో ఫ్రాంకో డీ క్యాప్పో, డేవిడ్ పాల్ సభ్యులతో కూడిన అంతర్జాతీయ నిపుణుల కమిటీని సీడబ్ల్యూసీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నాలుగోసారి మే నెల 5 నుంచి 9వ తేదీ వరకు పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. పనులపై అధికారులు, కాంట్రాక్టు సంస్థలతో సమీక్షించింది. క్షేత్ర స్థాయి పర్యటనలో గుర్తించిన అంశాలు, అధికారుల సమీక్షలో వెల్లడైన విషయాలు ఆధారంగా ఈ నెల 4న పీపీఏ, సీడబ్ల్యూసీలకు అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. ప్రాజెక్టు పనుల్లో లోపాలను ఎత్తిచూపుతూ, వాటిని సరిదిద్దుకోవడానికి చేపట్టాల్సిన చర్యలను ఆ నివేదికలో సిఫార్సు చేసింది.
నిబంధనలకు విరుద్ధంగా డయాఫ్రం వాల్ పనులు
పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) గ్యాప్-2లో కేంద్ర జల సంఘం ఆమోదించిన డిజైన్కు విరుద్ధంగా పనులు చేస్తుండటాన్ని అంతర్జాతీయ నిపుణుల కమిటీ తీవ్రంగా ఆక్షేపించింది. మందం తగ్గించటంపై తక్షణమే సమీక్షించి, తగిన నిర్ణయం తీసుకోవాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీకి సూచించింది. దీంతోపాటు డయాఫ్రం వాల్ నిర్మాణంలో వినియోగిస్తున్న టీ-16 ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంలో నీటి శాతం అధికంగా ఉన్నట్లు అంతర్జాతీయ నిపుణుల బృందం గుర్తించింది. ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమం 32 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నాణ్యంగా ఉంటుందని, కానీ డయాఫ్రం వాల్లో వినియోగిస్తున్న కాంక్రీట్ మిశ్రమం ఉష్ణోగ్రత 35 డిగ్రీలు ఉందని ఎత్తి చూపింది.
గత మూడు నెలల్లో 52 ప్యానళ్లతో డయాఫ్రం వాల్ పనులు చేశారని, అందులో 9 ప్యానళ్ల పరిధిలో డయా ఫ్రం వాల్ ఉపరితలంపై ఎయిర్ బబుల్స్ (సీపేజీ) ఉన్నట్లుగా చెప్పింది. ప్రాజెక్టు భద్రత దృష్ట్యా, సీపేజీ ఉన్న ప్యానళ్ల పరిధిలో డయా ఫ్రం వాల్ పైభాగంలో 1 నుంచి 2 మీటర్ల లోతు వరకు తొలగించి, మళ్ళీ కొత్తగా వేయాలని పీపీఏకు సూచించింది. డయాఫ్రం వాల్ నిర్మాణంలో ఒక ప్యానల్ను మరో ప్యానల్తో నిలువునా జత చేసేటప్పుడు 7.5 సెంటీమీటర్లకు బదులుగా కనీసం పది సెంటీ మీటర్ల పొడవున ఓవర్ ల్యాప్ చేయాలని సూచించింది. అప్పుడే సీపేజీకి సమర్థవంతంగా అడ్డుకట్ట వేయొచ్చని పేర్కొంది.
ప్రాజెక్ట్ పనుల్లోనూ తీవ్ర జాప్యం
ప్రధాన డ్యాం గ్యాప్-2లో డయా ఫ్రం వాల్ పనులను 66 వేల చదరపు మీటర్ల పరిధిలో చేయాలి. నిర్దేశించుకున్న షెడ్యూలు ప్రకారం 2025 జూన్ నాటికి 28 వేల చదరపు మీటర్ల పరిధిలో డయాఫ్రం వాల్ పనులు పూర్తి చేయాలి. 2025 ఏప్రిల్ నాటికి 15 వేల చదరపు మీటర్ల పరిధిలో పనులు పూర్తి చేయాల్సి ఉండగా, 12 వేల చదరపు మీటర్ల పరిధిలో మాత్రమే పూర్తయ్యాయి. దాదాపు 3 వేల చదరపు మీటర్ల పరిధిలో పనులు వెనుకబడినట్లు నిపుణుల కమిటీ తేల్చింది. దాదాపు 35 రోజులు వెనుకబడి ఉన్నారు. పనుల్లో జాప్యానికి కాంట్రాక్టు సంస్థ బావర్ చెబుతున్న కారణాలు సహేతుకంగా లేవని నిపుణుల కమిటీ కుండబద్దలు కొట్టింది. డయాఫ్రం వాల్ ప్యానళ్లను అత్యంత కఠిన శిల (సౌండ్ హార్డ్ రాక్) లోపలికి రెండు మీటర్ల లోతు వరకు దించితేనే, సీపేజీని సమర్థవంతంగా నియంత్రించవచ్చని పేర్కొంది. అలా చేయడం వల్లే పనులు ఆలస్యమవుతున్నాయని చెప్పడం విడ్డూరంగా ఉందని కమిటీ చెప్పింది.’ అని పేర్కొన్నారు.