
సాక్షి, తాడేపల్లి: కాపులపై చంద్రబాబుకు ఎందుకంత కోపం? అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నిలదీశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కోర్టు కొట్టేసిన కేసును మళ్లీ తిరగతోడితే కాపు సమాజం తరపున ఒక కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. కాపులను బీసీల్లోకి చేర్చుతానని 2014 ఎన్నికలకి ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయాలని ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేశారు. ఆయన పిలుపుతో అన్ని రాజకీయ పార్టీల్లోని కాపులు మద్దతు తెలిపారని అంబటి రాంబాబు వివరించారు.
‘‘తుని సభ సమయంలో రైలు తగులపడితే కాపులే నిప్పు పెట్టారని కేసులు పెట్టారు. ముద్రగడ కుటుంబ సభ్యులు మీద దాడి చేసి, ఆయన్ని నిర్బంధించారు. అప్పుడు నేను, దాసరి నారాయణరావు, చిరంజీవి, రామచంద్రయ్య తదితరులంతా హైదరాబాదులో సమావేశం అయ్యాం. ముద్రగడ పద్మనాభం ఒంటిరి కాదు. ఆయన వెనుక మా కాపుజాతి అంతా ఉంది. కాపు ఉద్యమ కారుల మీద పెట్టిన కేసులను జగన్ తొలగించారు. కోర్టు సైతం కేసులను కొట్టేసింది. అలాంటి కేసులను తిరగదోడటం వెనుక చంద్రబాబుకు దురుద్దేశం ఉంది’’ అని అంబటి రాంబాబు మండిపడ్డారు.
‘‘దీనిపై మేమంతా సమావేశం నిర్వహించి ఒక కార్యాచరణను రూపొందిస్తాం. చంద్రబాబు, హోంమంత్రికి తెలియకుండా జీవో వచ్చిందా?. అలా వచ్చి ఉంటే వారంత అసమర్థులు మరెవరు ఉండరు. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు మోసం చేశారు. తనది డేగ కన్ను అని చెప్పుకున్న చంద్రబాబుకు తెలియకుండానే జీవో వచ్చిందా?. చంద్రబాబుది డేగ కన్ను కాదు, గుడ్డికన్ను. తన ప్రభుత్వంపై తానే విచారణ జరిపించుకోవటం చంద్రబాబుకు సిగ్గుచేటు. కాపు సమాజానికి చంద్రబాబు సమాధానం చెప్పాలి’’ అని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.