
సాక్షి, కాకినాడ: విజయవాడ వరదలతో కూటమి అసలు స్వరూపం బయటపడిందన్నారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. సకాలంలో వరద సహాయక చర్యలు అందించడంతో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందినట్టు చెప్పుకొచ్చారు. దాతల నుండి వచ్చిన సాయాన్ని హారతి కర్పూరం చేశారని ఆరోపించారు.
మాజీ మంత్రి కురసాల కన్నబాబు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. వరదలను చంద్రబాబు పండుగ చేసుకున్నారు. సంక్షోభం నుండి సంపద సృష్టించినట్లు ఉంది. సకాలంలో వరద సహయక చర్యలు అందించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. కూటమి అసలు స్వరూపం ఏమిటో బయట పడింది. ప్రజలు ఏమనుకుంటారో అని సిగ్గులేకుండా ప్రభుత్వం ఉంది. వినాయక చవితి, దసరా చందాలు వసూలు చేసినట్లు చంద్రబాబు వరదలకు సహాయం వసూలు చేశాడు. రూ.368 కోట్లతో ఎంత మందికి భోజనాలు పెట్టారు.
కృష్ణా, గోదావరి వరదలకే చంద్రబాబు హడావిడి చేశాడు. కొవ్వొత్తులకు, అగ్గిపెట్టెలకు రూ.28 కోట్లు ఖర్చు చేశారా?. డ్రోన్లకు రూ.2కోట్లు ఖర్చు చేశారంట. చంద్రబాబు సర్కార్కు వరదొచ్చినా.. కరువొచ్చినా పండుగే. ఇది మంచి ప్రభుత్వం అని చెబుతున్న కూటమి నేతలు చెబుతున్నారు. వరద లెక్కలకు తేడా చూడమని ప్రజలను కోరుతున్నాం. నష్టపోయిన లక్షలాది ఎకరాల్లో పంటలకు ఎన్యూమరేషన్ జరగలేదు. ఇన్ని లెక్కలు వేసుకుంటున్న మీకు ప్రజలు ఏ లెక్క వేస్తారో అర్ధం కావడం లేదా?
ఎన్నో సంస్థలు.. స్వచ్చంద సంస్థలు వరద బాధితులకు సాయం చేశాయి. వైఎస్సార్సీపీ కూడా ముందుకు వచ్చి వరద సాయం అందించింది. దాతల నుంచి వచ్చిన వరద సాయాన్ని హారతి కర్పూరం చేశారు. ఇప్పటికీ విజయవాడలో సాయం అందలేదని వరద బాధితులు ఆందోళనలు చేస్తున్నారు. వరద నష్టం కోసం మేయర్ అడిగితే విజయవాడ అధికారులు ఎందుకు నిరాకరించారు. ఇంత దుర్మార్గంగా ఖర్చు చేశామని లెక్కలు ఎలా రాస్తారు. రేపు ప్రజలకు తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ప్రజలు మన గురించి ఎలా ఆలోచిస్తారు అని చంద్రబాబుకు ధ్యాసే లేదు’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
ఇది కూడా చదవండి: పవన్ స్వామీ.. మీరు అరవాల్సింది ఎక్కడో తెలుసా?: ఆర్కో రోజా