
ముఖ్యమంత్రి చంద్రబాబును నిలదీసిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్
మా ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో చేసిన రుణంలో.. మీరు ఏడాదిలోనే చేసిన అప్పు 44 శాతం
మీరు అడ్డగోలుగా, భారీగా అప్పులు చేసినా అభివృద్ధి జాడ లేదు.. సంక్షేమం ఊసే లేదు
మీ దశాబ్దాల అనుభవం ఏడాదిగా రాష్ట్రానికి ఇచ్చింది ఇదేనా?
కాగ్, ఎంవోఎస్పీఐ నివేదికలు, గణాంకాలతో టీడీపీ కూటమి ప్రభుత్వ ఆర్థిక అసమర్థతను కడిగేస్తూ ‘ఎక్స్’లో వైఎస్ జగన్ పోస్టు
సాక్షి, అమరావతి: ‘‘దశాబ్దాల రాజకీయ అనుభవంతో పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి పాలనపై లోతైన అవగాహన ఉందని మీరు చెప్పుకొంటున్నారు. కానీ, ఆ దశాబ్దాల అనుభవం ఈ ఏడాదిగా రాష్ట్రానికి ఏం ఇచ్చింది?’’ అంటూ ‘ఎక్స్’వేదికగా సీఎం చంద్రబాబును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. తమ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన రుణంలో.. కేవలం ఏడాదిలోనే టీడీపీ కూటమి సర్కారు 44 శాతం అప్పు చేసిందని దెప్పిపొడిచారు. ‘‘ఏడాదిగా మీ ప్రభుత్వం అడ్డగోలుగా, భారీగా అప్పు చేసినా సంక్షేమం ఊసేలేదు.

అభివృద్ధి జాడే లేదు. దశాబ్దాల అనుభవం మీకు నేర్పింది ఇదేనా?’’ అంటూ వ్యంగ్యా్రస్తాలు సంధించారు. మీ ప్రభుత్వ ఆర్థిక అసమర్థతపై కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్), ఎంవోఎస్పీఐ (కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ) నివేదికలు దిగ్భ్రాంతికర వాస్తవాలను బహిర్గతం చేస్తున్నాయని తెలిపారు. కాగ్, ఎంవోఎస్పీఐ నివేదికలు, ఆ సంస్థలు వెల్లడించిన గణాంకాలను ఉటంకిస్తూ.. ఏడాదిగా చంద్రబాబు కూటమి ప్రభుత్వ ఆర్థిక అసమర్థతను కడిగేస్తూ ‘ఎక్స్’లో తన ఖాతాలో వైఎస్ జగన్ సోమవారం పోస్టు చేశారు. ఆ పోస్టులో ఏమన్నారంటే..

1. జీఎస్డీపీ (రాష్ట్ర స్థూల ఉత్పత్తి)లో ద్రవ్య లోటు 4.08 శాతం నుంచి ఏడాదిలోనే 5.12 శాతానికి పెరిగింది.
2. జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 2.65 శాతం నుంచి ఏడాదిలోనే 3.61 శాతానికి చేరింది.
3. కరోనా మహమ్మారి వ్యాప్తి వంటి ప్రతికూల పరిస్థితులు లేనప్పటికీ జీఎస్డీపీలో అప్పుల వాటా 35.64 శాతానికి పెరిగింది.
4. 2024–25లో భారీగా చేసిన అప్పుల్లో కేవలం 23.49 శాతం మాత్రమే మూలధన వ్యయం కోసం ఖర్చు చేశారు. కానీ.., మా ప్రభుత్వ హయాంలో 33.25 శాతం మూల ధన వ్యయం చేశాం.