‘మహా’రాజకీయాల్లో కీలక పరిణామం.. షిండే ఏమన్నారంటే? | Will Shrikant Shinde Be Maharashtra Deputy Chief Minister | Sakshi
Sakshi News home page

‘మహా’రాజకీయాల్లో కీలక పరిణామం.. షిండే ఏమన్నారంటే?

Dec 1 2024 6:18 PM | Updated on Dec 1 2024 6:18 PM

Will Shrikant Shinde Be Maharashtra Deputy Chief Minister

ముంబై : మహరాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మహరాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే కుమారుడు శ్రీకాంత్‌ షిండేని డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టాలనే యోచనలో మహాయుతి కూటమి పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా  చర్చలు జరుపుతున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే, ఆ చర్చల్లో నిజమెంత? అనే దానిపై స్పష్టత రావాలంటే వేచి చూడాల్సి ఉంది.  

మరోవైపు, శ్రీకాంత్‌ షిండేకు డిప్యూటీ సీఎం బాధ్యతలు అప్పగిస్తున్నారంటూ వస్తున్న వార్తపై ఏక్‌నాథ్‌ షిండే స్పందించారు. ‘ఇలాంటి చర్చలన్నీ మీడియా వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంటాయి. మహాయుతి కూటమిలో పదవులపై ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.  

ఎన్నికల ఫలితాల అనంతరం, రాష్ట్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుపై ఇప్పటికే కేంద్రం హోంమంత్రి అమిత్‌ షాత్‌తో నేను (ఏక్‌నాథ్‌షిండే), అజిత్‌ పవార్‌, దేవేంద్ర ఫడ్నవీస్‌ భేటీ అయ్యాం. ముంబైలో మరోసారి చర్చలు జరగనున్నాయి. ఆ సమావేశంలో అన్నీ విషయాలపై కులంకషంగా చర్చిస్తాం. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని అందించిన ప్రజలకు మేం జవాబుదారీగా ఉన్నాం’ అని వ్యాఖ్యానించారు. 

మరోవైపు, మహాయుతి పెద్దలు తీసుకున్న నిర్ణయంపై అసంతృప్తిగా ఉన్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఏక్‌నాథ్‌ షిండే ఖండించారు. తీవ్ర జ్వరంతో సతారా జిల్లాలోని తన స్వగ్రామంలో ఉన్న షిండే మీడియాతో మాట్లాడుతూ.. నిర్విరామంగా ఎన్నికల ప్రచారం కారణంగా అనారోగ్యానికి గురయ్యా. అందుకే మా స్వగ్రామం వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నా. నా ఆరోగ్యం బాగుంది. ఇక మహరాష్ట్ర సీఎం ఎవరు? అని అంటారా.  సోమవారం మహాయుతి పెద్దలే స్పష్టత ఇస్తారు’ అని స్పష్టం చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement