మోదీ 3.0 మంత్రివర్గ కూర్పుపై కసరత్తు.. ఎవ‌రికి ఏ ప‌ద‌వులు? | Who Gets Which Ministry In Modi 3.0 Cabinet? Key Meeting Today | Sakshi
Sakshi News home page

మోదీ 3.0 మంత్రివర్గ కూర్పుపై కసరత్తు.. ఎవ‌రికి ఏ ప‌ద‌వులు?

Jun 8 2024 1:32 PM | Updated on Jun 8 2024 3:05 PM

Who Gets Which Ministry In Modi 3.0 Cabinet? Key Meeting Today

Update

  • ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కొత్త మంత్రివర్గంలో నితీష్ కుమార్‌కు చెందిన‌ జేడీయూకి  రెండు  శాఖలు లభించ‌నున్న‌ట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. 

  • జేడీయూ సీనియ‌ర్ నేత‌లు లాలన్ సింగ్, రామ్ నాథ్ ఠాగూర్ పేర్ల‌ను పార్టీ ప్రతిపాదించింది. కాగా లాలన్ సింగ్ బిహార్‌ళోని ముంగేర్ నుంచి లోక్ సభకు ఎన్నికవ్వ‌గా..  రామ్ నాథ్ ఠాగూర్ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఇదిలా ఉండ‌గా రామ్ నాథ్ ఠాగూర్‌ భారతరత్న అవా గ్రహీత కర్పూరి ఠాకూర్ కుమారుడు.

న్యూఢిల్లీ: మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి 7.15 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఈ కార్యక్రమంలో మోదీతో పాటు ఆయన క్యాబినెట్ మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో క్యాబినెట్ కూర్పుపై క‌స‌ర‌త్తు కొనసాగుతోంది.

ఈ క్ర‌మంలో  అమిత్ షా నివాసంలో శనివారం ఎన్డీయే కూటమి నేతలు సమావేశ‌మ‌య్యారు. ఈ భేటీకి జేపీ న‌డ్డా, బీజేపీ సంస్థాగ‌త ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బీఎల్ సంతోష్ హాజ‌ర‌య్యారు. ప్ర‌స్తుతం మోదీ 3.0 కేబినెట్‌లో ఎవ‌రెవ‌రికి మంత్రి ప‌ద‌వులు వ‌రించ‌నున్నాయ‌నే అంశంపై స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంగా మారింది. అయితే ఎన్​డీఏ కూటమిలో కీలకంగా మారిన టీడీపీ, జేడీయూలు కీల‌క ప‌ద‌వులు కోరుతూ తమతమ డిమాండ్​లను మోదీ ముందు పెట్టిన‌ట్లు తెలుస్తోంది.

అయితే కీలకమైన హోమ్, ఆర్థిక, రక్షణ, విదేశాంగ శాఖలు బీజేపీ త‌న‌వ‌ద్ద‌నే ఉంచుకోవాల‌ని నిర్ణ‌యించుకుంది. అటు టీడీపీ మూడు మంత్రు పదవులతోపాటు, రెండు సహాయ మంత్రి పదవులు  కోరుతున్న‌ట్లు తెలుస్తోంది. కాగా టీడీపీకి డిప్యూటీ స్పీకర్ పదవి దక్కే అవకాశం కూడా ఉంది. ఇక మూడు మంత్రి ప‌ద‌వులతోపాటు బీహార్ ప్రత్యేక హోదా ప్రకటించాలని సీఎం నితీశ్ కుమార్ ప‌ట్టుబ‌డుతున్న‌ట్లు తెలుస్తోంది.  వీటితోపాటు  శివసేన, ఎన్సీపీ, ఆర్ ఎల్జేపీ ఒక్కొక్క మంత్రి పదవి కోరుతున్న‌ట్లు స‌మాచారం.

ఇక‌ శుక్రవారం జరిగిన ఎన్డీయే ఎంపీల సమావేశంలో కూటమి పక్షనేతగా నరేంద్ర మోదీని ఎన్నుకోవడంలో చంద్రబాబు, నితీశ్‌లు కీలకంగా వ్యవహరించారు.ఇండియా కూటమితో ఇరువురూ సంప్రదింపులు జరుపుతున్నారనే ఊహాగానాలకు తెరదించుతూ లిఖితపూర్వకంగా మోదీకి మద్దతు తెలిపారు. ఇదే సమయంలో  ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీకి దీటుగా ఇండియా కూటమి మంచి ఫలితాలను సాధించింది. ప్రతిపక్ష కూటమి 232 సీట్ల‌ను గెలుచుకుంది. ఇండియా కూటమికి నాయకత్వం వహించిన కాంగ్రెస్ 328 స్థానాల్లో పోటీచేసి 99 సీట్లను గెలుచుకుంది.

2024 లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ స్వ‌త‌హాగా 242 స్థానాలు గెలుచుకున్న‌ప్ప‌టికీ ప్ర‌భుత్వ ఏర్పాటుకు కావాల్సిన‌  మెజారిటీ రాకపోవడంతో.. ఎన్టీయే మిత్ర ప‌క్షాల‌తో క‌లిసి కేంద్రంలో మూడోసారి బీజేపీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌బోతుంది. ఎన్డీయేలో భాగ‌మైన టీడీపీి 16 స్థానాలు, నితీష్‌కుమార్‌కు చెందిన జేడీయూ 14, ఏక్‌నాథ్ షిండే నేత‌!త్వంలోని శివ‌సేన 7, లోక్‌జ‌న‌శ‌క్తి రామ్ విలాస్ 3 చోట్ల విజ‌యం సాధించింది. దీంతో మొత్తం 290 స్థానాల్లో ఎన్డీయే గెలుపొందింది.

Advertisement
 
Advertisement
Advertisement