కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని గవర్నర్ ఆర్ఎన్ రవి రద్దు చేశారు. మమతా బెనర్జీ రాజీనామా చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 9న పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనుంది. శుక్రవారం (మే 8న) బీజేపీ శాసనసభా పక్ష సమావేశం జరుగుతుంది.
కాగా, ఈవీఎంల మానిప్యులేషన్, హింస ద్వారా పశ్చిమ బెంగాల్లో ప్రజా తీర్పును మార్చారంటూ బీజేపీ, భారత ఎన్నికల కమిషన్పై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోనని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తమ పార్టీ కోర్టును ఆశ్రయించనున్నట్టు ప్రకటించారు.
బెనర్జీ తన నిర్ణయంపై వెనక్కి తగ్గకపోవడంతో, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ అగర్వాల్ గవర్నర్ ఆర్ఎన్ రవిని కలిసి ఎన్నికల ఫలితాల గెజిట్ నోటిఫికేషన్ను సమర్పించారు. దీంతో ఘన విజయం సాధించిన బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆహ్వానించే ప్రక్రియకు మార్గం సుగమమైంది. అగర్వాల్తో పాటు ప్రధాన కార్యదర్శి దుశ్యంత్ నరియాలాను కూడా గవర్నర్ను కలిశారు. అనంతరం అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. “భారత ఎన్నికల కమిషన్ గెలిచిన అభ్యర్థుల గెజిట్ నోటిఫికేషన్ను ప్రచురించింది. ఇప్పుడు రాజ్యాంగ నిబంధనల ప్రకారం గవర్నర్ అన్ని నిర్ణయాలు తీసుకుంటారు” అన్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 172ను ప్రస్తావిస్తూ, లోక్ భవన్కు చెందిన ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. ఐదేళ్ల పదవీకాలం ముగియడంతో మే 6 అర్ధరాత్రి నుంచి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఆటోమేటిక్గా రద్దవుతుందని తెలిపారు. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే వరకు ప్రస్తుత మంత్రివర్గం తాత్కాలిక ప్రభుత్వంగా కొనసాగవచ్చని చెప్పారు.


