సాక్షి,చెన్నై: తమిళనాడులో టీవీకే ఘనవిజయం సాధిస్తూ సంచలనం సృష్టిస్తోంది. పార్టీ ఇప్పటికే 18 స్థానాల్లో గెలిచి, మరో 90కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మధ్యాహ్నం సమయంలో టీవీకే ఆధిక్యం తగ్గినా, కొద్ది సేపట్లోనే తిరిగి బలంగా ముందంజ వేసి డీఎంకే, ఏడీఎంకేలను దాటేసింది.
టీవీకే అధినేత విజయ్ పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుండి పోటీ చేసి, రెండింటిలోనూ విజయం సాధించారు. విజయ్ పార్టీ ఈసారి ఎలాంటి కూటములు లేకుండా, ఒంటరిగా అన్ని 234 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. ఈ ఎన్నికలు టీవీకే, డీఎంకే, బీజేపీ మధ్య త్రిముఖ పోటీగా మారాయి.
విజయ్ రాజకీయ ప్రవేశం
విజయ్ 2024 ఫిబ్రవరి 2న తమిళగ వెటట్రి కజగంను ప్రారంభించారు. ఎన్నికల సంఘం ఈ పార్టీని 2024 సెప్టెంబర్ 8న అధికారికంగా నమోదు చేసింది. ప్రారంభం నుంచే విజయ్ తన పార్టీని ఆధునిక ద్రావిడ సిద్ధాంతాలపై నిలబెట్టారు. దుష్ట శక్తి, అవినీతి శక్తికి ఎదురు నిలిచే ధైర్యం తన పార్టీకి మాత్రమే ఉందని ఆయన ప్రకటించారు.
విజయ్ తన విజయాన్ని ఎంజీఆర్ తరహాలో రాయాలని, ఈ ఏడాదే అధికారంలోకి రావాలని సంకల్పించారు. ఆయన డీఎంకేను దుష్ట శక్తిగా, బీజేపీని సిద్ధాంతపరమైన ప్రత్యర్థిగా అభివర్ణించారు.
పోటీ చేసిన తొలిసారి ఎన్నికల్లోనే విజయ్ పార్టీ టీవీకే తమిళనాడులో అతిపెద్ద పార్టీగా అవతరించడం మరో విశేషం. సాయంత్రం 6.00 గంటల వరకు టీవీకే 111 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉంది. అదే సమయంలో అధికార డీఎంకే 71 స్థానాల్లో, ఏడీఎంకే 52 స్థానాల్లో ముందంజలో ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ సంఖ్య 118.


