Video: BJP MP Demands Word India To Be Removed From Constitution - Sakshi
Sakshi News home page

రాజ్యాంగం నుంచి ‘ఇండియా’ పేరు తొలగించాలి.. బీజేపీ ఎంపీ సంచలన డిమాండ్‌

Jul 28 2023 5:03 PM | Updated on Jul 28 2023 6:48 PM

Video: BJP MP Demands Word India To Be Removed From Consitution - Sakshi

న్యూఢిల్లీ: 26 పార్టీలతో కూడిన ప్రతిపక్ష 'ఇండియా' కూటమి పేరు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. విపక్షాల INDIA కూటమిపై అధికార బీజేపీ విమర్శలు, వ్యంగ్యస్త్రాలు సంధిస్తోంది. బ్రిటిష్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీ, ఉగ్రవాద సంస్థలు ఇండియన్‌ ముజాహిద్దీన్‌, పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా..పేర్లలో కూడా ఇండియా పేరు ఉందని ఇటీవల ప్రధాని మోదీ విరుచుకుపడిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష కూటమికి దిశానిర్దేశం లేదని.. ఇండియా అనే పేరు పెట్టుకున్నంత మాత్రాన ప్రజలు మోసపోరని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

తాజాగా ఇండియా పేరుపై వివాదం రాజ్యసభలోనూ చెలరేగింది. ఇండియా అనే పదాన్ని రాజ్యాంగం నుంచి తొలగించాలని ఉత్తరాఖండ్‌కు చెందిన బీజేపీ ఎంపీ నరేష్ బన్సాల్ రాజ్యసభలో సంచలన డిమాండ్ చేశారు. ‘ఇండియా’ (INDIA) అనేది నిజమైన పేరైన ‘భారత్‌’ స్థానంలో వలసరాజ్యం విధించిన పదమని ఆయన పేర్కొన్నారు.. ఇండియా పేరు మన దేశంలో నేటికీ బానిసత్వానికి చిహ్నమని, దానిని వెంటనే తొలగించాలని బీజేపీ ఎంపీ అన్నారు.
చదవండి: గవర్నర్‌ను వదిలేసి వెళ్లిపోయిన విమానం.. అధికారులు సీరియస్‌

ఆయన మాట్లాడుతూ.. విప్లవకారులు, స్వాతంత్య్ర సమరయోధుల పోరాడి బలిదానాల దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు. తర్వాత 1950లో రూపొందించిన రాజ్యాంగంలో ఇండియా దట్ ఈజ్ భారత్’ అని రాశారన్నారు.. ప్రాచీన కాలం నుంచి దేశానికి భారత్ అనే పేరు ఉందని, ఆ పేరుతోనే పిలవాలని తెలిపారు. స్వాతంత్య్ర స్వర్ణయుగంలో వలస వారసత్వాన్ని దూరం చేయాలని పిలుపునిచ్చారు.

గత ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ బానిసత్వ చిహ్నాలను వదిలించుకోవాలని విజ్ఞప్తి చేశారని నరేష్‌ బన్సాల్‌ గుర్తు చేశారు. అదే సమయంలో వాటి స్థానంలో భారతీయ చిహ్నాలు, విలువలు, ఆలోచనలను అమలు చేయాలని ఆయన సూచించారు. అయితే బన్సాల్‌ మాత్రమే కాదు  ఇప్పటికే చాలా మంది బీజేపీ నేతలు 024 లోక్‌సభ ఎన్నికలు ‘ఇండియా-భారత్‌ మధ్య జరిగే పోరాటంగా పేర్కొంటున్నారు. 

ఇదిలా ఉండగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోని ఎన్డీయే సర్కార్‌ను ఓడించడమే లక్ష్యంగా 26 విపక్ష పార్టీలు కలిసి ‘ఇండియా పేరిట కూటమిగా ఏర్పాటైన విషయం తెలిసిందే. ఇటీవల బెంగళూరులో జరిగిన సమావేశంలో ఈ పేరును ఫిక్స్‌ చేశాయి. తదుపరి సమావేశం ముంబయిలో నిర్వహించనున్నారు. శివసేన (యూబీటీ), ఎన్సీపీ శరద్‌ పవార్‌ ఆధ్వర్యంలో ఈ భేటీ జరగనుంది. అయితే ఆగస్టు 25, 26 తేదీల్లో ఈ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సమావేశంలోనే 11 మంది సభ్యులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. 
చదవండి: పిచ్చిపిచ్చిగా కొట్టుకున్న అత్తా కోడళ్లు .. వీడియో తీసిన కొడుకు

Advertisement
 
Advertisement
Advertisement