సాక్షి, తాడేపల్లి: స్కిల్ స్కామ్ నుంచి డీఎస్సీ వరకు అవినీతి, అక్రమాలపై ప్రజలకు సమాధానం చెప్పకుండా సంబరాలు చేసుకోవడం చంద్రబాబు, లోకేశ్కు పరిపాటిగా మారిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ధ్వజమెత్తారు. చంద్రబాబుపై స్కిల్ కేసు పెట్టింది వైఎస్ జగన్ కాదు.. ఈడీ పెట్టింది. కానీ తనపై వైఎస్ జగన్ కేసులు పెట్టించాడంటూ అన్యాయంగా మాట్లాడుతున్నారు. అనారోగ్య సమస్యలు చూపించి బెయిల్ తెచ్చుకున్న వ్యక్తి చంద్రబాబు’’ అంటూ నరేంద్ర మండిపడ్డారు.
‘‘అధికారులను భయపెట్టి తనపై ఉన్న కేసులను వెనక్కి తీసుకునేలా చేసుకుంటున్నారు. తనపై కేసులకు తానే క్లీన్ చిట్ ఇచ్చుకోవటం సిగ్గుచేటు. చంద్రబాబు నేరం చేసినట్లు ఛార్జ్ షీట్ లో స్పష్టంగా ఉంది. ప్రభుత్వం మారిన తరువాత వరుసగా కేసులు క్లోజ్ అవుతున్నాయి. స్కిల్ కేసులో నలుగురిని ఈడీ అరెస్టు చేసింది. స్కిల్ కేసులో క్లీన్ చిట్ ఇచ్చిందంటున్నారు. ఆ లెటర్ బయట పెట్టగలరా?.సిద్ధార్థ లూథ్రాకి ఏ అధికారంతో ఏపీ పోలీసు అధికారులతో సమావేశాలు పెడుతున్నారు. చంద్రబాబు అడ్డదారిలో అధికారంలోకి రాకుండా ఉంటే జీవిత కాలం జైల్లో ఉండే కేసులు ఉన్నాయి. చంద్రబాబు మళ్లీ జైలుకి వెళ్ళడం ఖాయం’’ అని వంగవీటి నరేంద్ర వ్యాఖ్యానించారు.


