సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాంతి భద్రతలపై గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఇవాళ (బుధవారం) లోక్భవన్లో గవర్నర్ను కలిసిన బీఆర్ఎస్ నేతలు.. అసెంబ్లీ ఘటనలో పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు. అనంతరం మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపించేలా పాలన కొనసాగుతుందన్నారు.
‘‘రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై గవర్నర్కు ఫిర్యాదు చేశాం. వెయ్యి రోజుల పాలన వైఫల్యాలు, యూరియా కొరత, రైతు బీమా, రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసినందుకు గవర్నర్కు ఫిర్యాదు చేశాం. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యపై ఫిర్యాదు చేశామని కేటీఆర్ అన్నారు. రాహుల్ గాంధీ నల్ల టీ షర్ట్స్ వేసుకున్నట్టే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బ్లాక్ టీ షర్ట్స్ వేసుకున్నాము. బ్లాక్ టీ షర్ట్ తో అసెంబ్లీకి వెళ్తుంటే మమ్మల్ని పోలీసులు అడ్డుకున్నారు.’’ అని కేటీఆర్ మండిపడ్డారు.
‘‘మాజీ హోం శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని మగ పోలీసులు గొంతు పట్టుకున్నారు. మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి చీర పట్టుకొని లాగారు. దాడి చేసి మా పైనే ఉల్టా కేసులు పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ చావు కోరుకున్నారు. వేముల వీరేశం, కుంభం అనిల్రెడ్డి, నర్సారెడ్డి ఎర్రవల్లి ఫాం హౌస్ దగ్గరకు వచ్చారు. వేల మంది కాంగ్రెస్ గూండాలను ఎర్రవల్లి ఫాం హౌస్పై దాడి చేసేందుకు ఉసిగొల్పారు. మేము అనని మాటలను అన్నట్టు స్పీకర్కు ఆపాదించారు. దళిత స్పీకర్ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే స్పీకర్ను అవమానిస్తున్నారు.
..శాసన సభ కాదు.. దుశ్శాసన సభలా మార్చారు. చావు డప్పు ఎప్పుడు కొడతారో.. మనందరికీ తెలుసు. ఎర్రవల్లి ఫాం హౌస్ దగ్గర చావు డప్పు కొట్టారు. అసెంబ్లీ బయట జరిగిన ఘటనపై సీఎస్ డీజీపీని పిలిపించి మాట్లాడుతానని గవర్నర్ హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు మంచివి కాదని గవర్నర్ మాతో చెప్పారు.’’ అని కేటీఆర్ వివరించారు.
ఇదీ చదవండి: బీఆర్ఎస్ సభ్యుల్ని సస్పెండ్ చేసిన స్పీకర్


