తాడేపల్లి: వైఎస్సార్సీపీని తిట్టడమే టీడీపీ నేతల పనా? అని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు. తాడేపల్లిలో ఆమె బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. తప్పుడు ఆరోపణలు చేయడం, పారిపోవడం టీడీపీ నేతలకే చెల్లిందని ఆమె విమర్శించారు.
టీడీపీ నేతలు ఆధారాలు చూపించరని, దూషణలు మాత్రం చేస్తారని వరుదు కల్యాణి అన్నారు. డీఎస్సీలో అక్రమాలకు సమాధానాలు చెప్పకుండా పారిపోతున్నారని చెప్పారు. మెగా డీఎస్సీని దగా డీఎస్సీ చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యేలతో ప్రెస్మీట్ పెట్టించి పచ్చి అబద్ధాలు చెప్పించారని తెలిపారు. డీఎస్సీలో అక్రమాలు చేయకపోతే సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. నారా వారి పాలన నకిలీ సర్టిఫికెట్ల పాలన అని ఆమె అన్నారు.
ఆ స్థాయిలో భారీ స్కాం..
‘‘డీఎస్సీలో విచారణ జరిగితే లోకేశ్ జైలుకే. ఆ స్థాయిలో భారీ స్కాం జరిగింది. స్కాంపై కూటమి నేతలు నోరు మెదపటం లేదు. సవాల్ చేసిన నేతలంతా ఇప్పుడెందుకు పారిపోయారు. టైం, డేట్ చెప్తే మేము చర్చకు రావటానికి సిద్ధమే. స్పోర్ట్స్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారిని కూడా చర్చకు తీసుకురావాలి.
డీఎస్సీ పరీక్ష రాయకుండా ఉద్యోగాలు ఇవ్వటం స్కాం కాదా? రూ.3 లక్షలకు 120 ప్రశ్నలు అమ్ముకోవటం స్కాం కాదా? రూ.20 లక్షల చొప్పున ఉద్యోగం అమ్ముకోవడం స్కాం కాదా? టెట్ లేని ప్రభాకర్ గౌడ్ కు ఉద్యోగం ఇవ్వటం స్కాం కాదా? ఫేక్ జూడో సర్టిఫికేట్లు తెచ్చిన వారికి ఉద్యోగం ఇవ్వటం స్కాం కాదా?
వీటన్నిటిపై విచారణ జరగాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా? సీబీఐ విచారణ జరిగితే లోకేశ్ జైలుకు వెళ్లక తప్పదు. ఆ భయంతోనే సీబిఐతో విచారణ జరపటం లేదన్నది వాస్తవం కాదా? లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారు. ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు తెచ్చుకున్న వారి దగ్గర టీడీపీ నేతలు తమ పిల్లలకు చదువు చెప్పిస్తారా?
లోకేశ్ చేసిన తప్పులను కవర్ చేయలేక మహిళా అధికారులు ఇబ్బందులు పడ్డారు. ఫేక్ ప్రచారం చేయటం ఎలాగో చంద్రబాబు, లోకేశ్ ట్రైనింగ్ ఇచ్చారు. అందుకే పార్టీ నేతలంతా బయటకు వచ్చి డీఎస్సీలో అక్రమాలు జరగలేదంటూ కబుర్లు చెప్పారు’’ అని వరుదు కల్యాణి అన్నారు.


