
సాక్షి, విజయవాడ: పరిశ్రమలకు భూములివ్వాలనే తాపత్రయం తప్ప చంద్రబాబుకు రైతుల గురించి ఆలోచన లేదంటూ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంపద సృష్టించేదంతా పారిశ్రామికవేత్తలేనంటూ చంద్రబాబు మాట్లాడటం సిగ్గుచేటు అని దుయ్యబట్టారు.
‘‘పక్కనున్న తెలంగాణలో సన్న ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు క్వింటాకు మద్దతు ధరకంటే అదనంగా 800 రూపాయలు బోనస్ ఇస్తున్నాయి. కానీ ఏపీలో మాత్రం ఏ పంటకు కూడా మద్దతు ధర దొరకడం లేదు. పరిశ్రమలకు మేం వ్యతిరేకం కాదు.
..పరిశ్రమలు రావాలి. యువతకు ఉద్యోగాలు కావాలి. ఇప్పటికైనా చంద్రబాబు రైతుల గురించి ఆలోచన చేయాలి. ఏపీలో 50 శాతం పైన భూమి కౌలు రైతులు సాగుచేస్తున్నారు. కౌలు రైతులకు రైతు బంధు పథకం అమలు చేయాలి’’ అని వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండ్ చేశారు.