
ఎన్నో ఏళ్లుగా ‘రాజకీయ కత్తులు’ దూసుకుంటూనే ఉన్నారు.. ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూనే ఉన్నారు. వీరి వైరం సుమారు రెండు దశాబ్దాల నాటిది. ఒకప్పుడు కలుసున్న బంధం.. చాలా ఏళ్ల పాటు దూరంగానే ఉంటూ వచ్చింది. అది రాజకీయ వైరం కావడంతో ప్రజల్నే నమ్ముకుని పోరాటం సాగించారు. వారిలో ఒకరు ఉద్ధవ్ ఠాక్రే అయితే.. ఇంకొకరు రాజ్ ఠాక్రే.
వరుసకు సోదర బంధం వారిది. కానీ శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే జీవించి ఉన్న కాలంలోనే రాజ్ ఠాక్రే బయటకు వచ్చేశారు. శివసేనలో విభేదాల కారణంగా రాజ్ ఠాక్రే అక్కడ ఇమడలేక బయటకు వచ్చేశారు. ఎమ్మెన్నెస్ అంటూ పార్టీ స్థాపించి తన ఉనికిని మహారాష్ట్రలో చాటుకునే యత్నం చేశారు. కానీ ఆయన ఆశించిన ఫలితాలు ఏమీ చూడలేకపోయారు. చివరకు ఉద్ధవ్ ఠాక్రేతో కలిసేందుకు సిద్ధమయ్యారు రాజ్ ఠాక్రే.
శివసేనతో కలుస్తా..
ప్రస్తుతం మహారాష్ట్రలో సైతం హిందీ భాషా యుద్ధం నడుస్తోంది. తమకు థర్ద్ లాంగ్వేజ్ గా హిందీని తప్పనిసరి చేయాలని కేంద్రం చూస్తోంది. కేంద్ర ప్రభుత్వపు త్రి భాషా విధానంలో భాగంగా హిందీ థర్డ్ లాంగ్వేజ్ అంశాన్ని పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వమే కాబట్టి ఇక్కడ పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చు. కానీ ఉద్ధవ్ ఠాక్రే శివసేన(యూబీటీ)తో పాటు రాజ్ ఠాక్రే నేతృత్వంలోని ఎమ్మెన్నెస్ కూడా దీన్ని వ్యతిరేకిస్తోంది. అందుకే తాము ఒక్కటిగా పోరాడాలని నిర్ణయించుకున్నట్లు రాజ్ ఠాక్రే తెలిపారు.
ఫిల్మ్ మేకర్ మహేష్ మంజ్రేకర్ నిర్వహించిన పాడ్ కాస్ట్ లో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్ ఠాక్రే మాట్లాడుతూ.. తమ మధ్య ఉన్న విభేదాల్ని పక్కన పెట్టి రాష్ట్రం కోసం ఒక్కటవ్వాలని ఉందని పేర్కొన్నారు. శివసేనతో కలిసి పోరాటం చేయటానికి నిశ్చయించుకున్నానని, అది కూడా వారికి ఇష్టమైతేనే అంటూ రాజ్ ఠాక్రే పేర్కొన్నారు. ఇక్కడ మరాఠీల కమ్యూనిటీని రక్షించడంతో పాటు మరాఠీ భాషను కాపాడుకోవడం ముఖ్యమన్నారాయన.
మరి ఉద్ధవ్ ఏమన్నారంటే..
తనతో రాజ్ ఠాక్రే కలుస్తానంటే ఏమీ ఇబ్బంది లేదన్నారు. తమ మధ్య భేదాభిప్రాయల కారణంగా ఎవరికి వారు అన్నట్లు ఉంటున్నామని, రాజ్ వస్తానంటే తనకు అభ్యంతరం ఏమీ లేదన్నారు. కాకపోతే మరాఠీ కమ్యూనిటీని వ్యతిరేకించే శక్తులను వెంటబెట్టుకు రావద్దని తన కండిషన్ అంటూ ఉద్ధవ్ పేర్కొన్నారు. ‘ మన శత్రువర్గాన్ని ఇంటికి ఆహ్వానించి.. వారికి భోజన తాంబూలం ఇచ్చే సాంప్రదాయాన్ని రాజ్ ఠాక్రే వదిలేతేనే తనతో కలవచ్చన్నారు. ఇక్కడ ఇద్దరికీ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ఉద్దవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. 2024 లోక్ సభ ఎన్నికల సమయంలో ఎమ్మెన్నెస్.. ఎన్డీఏకు దగ్గరై వారికి మద్దతిచ్చింది. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వ వైఖరిపై అసహనంతో ఉన్న రాజ్ ఠాక్రే.. శివసేన(యూబీటీ) తో కలవడానికి సిద్ధం కావడం మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది.
20 ఏళ్ల కిందటే.. బయటకు
దాదాపు 19 ఏళ్ల కిందట బాలాసాహెబ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన నుంచి బయటకువచ్చిన రాజ్ ఠాక్రే 2006 మార్చి తొమ్మిదో తేదీన ఎమ్మెన్నెస్ పార్టీని స్ధాపించారు. ఆ తరువాత 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి తమ పార్టీ తరఫున అభ్యర్ధులను బరిలోకి దింపారు. వీరిలో ఏకంగా 13 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని ప్రశంసలు అందుకున్నారు.
ఆ సమయంలో ఎమ్మెన్నెస్కు 5.71 శాతం ఓట్లు పోలయ్యాయి. కానీ తరచూ పరాయిప్రాంతం వారిని ముఖ్యంగా ఉత్తరభారతీయులను లక్ష్యంగా చేసుకుని పదేపదే విమర్శించడంతో పార్టీ ప్రాబల్యం క్రమేపీ తగ్గుతూ వచ్చింది.
2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కరంటే ఒక్కరే గెలవగా మొత్తంమీద 3.15 శాతం ఓట్లు పోలయ్యాయి. ఆ తరువాత 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే పరిస్ధితి పునరావృతమైంది. కేవలం 2.25 శాతం ఓట్లు పోలైనప్పటికీ కల్యాణ్ నియోజక వర్గం నుంచి రాజు పాటిల్ ఒక్కరే గెలిచారు. అక్కడ నుంచి ఎమ్మెన్నెస్ గ్రాఫ్ క్రమేపీ తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం తన పార్టీ ఉనికే ప్రమాదంలో పడిన సమయంలో ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్ ఠాక్రే.. ఉద్ధవ్ ను కలవడానికి సిద్ధమైనట్లు పలువురు విశ్లేషిస్తున్నారు.