
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఉప ఎన్నికల కౌంటింగ్ ఉద్రిక్తతకు దారి తీశాయి. సోమవారం కాళీగంజ్ నియోజక వర్గంలోని కౌంటింగ్లో నాటు బాంబు పేలి 10ఏళ్ల బాలిక మృతి చెందింది.
తూర్పు నదియా జిల్లా బరోచాంద్ నగర్ గ్రామంలో ఎన్నికల కౌంటింగ్ జరిగింది. ఘటన జరిగే సమయానికి ఈ కేంద్రంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ లీడింగ్లో ఉంది. ఆ సమయంలో కౌంటింగ్ కేంద్రంలో నాటు బాంబు పేలి నాలుగో తరగతి చదువుతున్న 10 ఏళ్ల బాలిక తమన్నా ఖాటూన్ తీవ్రంగా గాయపడింది.
ఊహించని పరిణామంతో అప్రమత్తమైన స్థానికులు చిన్నారిని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆ చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే, ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న సీఎం మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు. చిన్నారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దుర్ఘటనకు కారణమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు.