బెంగాల్ రాజకీయాలను కుదిపేస్తున్న ‘నంబర్ 13’ రహస్యం! | TMC Crisis Deepens, 19 MPs Sign Rebel Letter, What Is Mystery Behind Number 13 Slot Sparks Political Buzz | Sakshi
Sakshi News home page

బెంగాల్ రాజకీయాలను కుదిపేస్తున్న ‘నంబర్ 13’ రహస్యం!

Jun 13 2026 7:17 PM | Updated on Jun 13 2026 8:12 PM

TMC crisis 19 MPs sign rebel letter number 13 becomes talk of the party

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో మరో ఉత్కంఠభరిత సీన్‌ నడుస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో తిరుగుబాటు చెలరేగుతోన్న విషయం తెలిసిందే. 19 మంది ఎంపీలు సంతకం చేసిన ఓ లేఖ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీలో టెన్షన్‌ పుట్టిస్తోంది. అయితే ఆ లేఖలోని ఒక చిన్న అంశం అందరి దృష్టిని ఆకర్షించింది. దానికి ఇప్పటివరకు ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. ఆ రెబల్‌ ఎంపీల జాబితా ఉన్న లేఖలో 1 నుంచి 20 వరకు సంఖ్యలు ఉన్నాయని, అయితే 13వ సంఖ్య వద్ద ఎలాంటి సంతకం లేదని సోర్సెస్‌ చెబుతున్నాయి. ఆ ఖాళీ స్థానం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. తెర వెనుక ఏం జరుగుతోందో చూద్దాం..

అసలు విషయం ఏంటి?
టీఎంసీ నాయకత్వంపై కొందరు ఎంపీలు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌కు లేఖ పంపి, తమను ప్రత్యేక వర్గంగా గుర్తించాలని, పార్టీ ఎన్నికల గుర్తుపై హక్కు కల్పించాలని కోరినట్లు చెప్పుకున్నారు. ఇద్దరు ఎంపీలు ఈ లేఖపై తాము సంతకం చేసినట్లు బహిరంగంగానే అంగీకరించారు. అయితే ఆ లేఖ అందిన విషయాన్ని స్పీకర్ కార్యాలయం ఇప్పటివరకు అధికారికంగా ధ్రువీకరించలేదు.

‘నంబర్ 13’ ఎందుకు అంత ఉత్కంఠ రేపుతోంది?
జాతీయ మీడియాలో పేర్కొన్న సమాచారం ప్రకారం.. లోక్‌సభ స్పీకర్‌కు పంపిన లేఖలో 1 నుంచి 20 వరకు వరుస సంఖ్యలు ఉన్నాయి. అందులో 19 మంది ఎంపీలు ఇప్పటికే సంతకాలు చేశారు. అయితే 13వ సంఖ్య పక్కనున్న స్థలం పూర్తిగా ఖాళీగా ఉంది. ప్రస్తుతం "నంబర్ 13" ఎవరో అధికారికంగా ఎవరూ వెల్లడించలేదు. టీఎంసీ రెబల్‌ ఎంపీల 13వ సంఖ్య వద్ద సంతకం లేకుండా ఖాళీగా ఉంచారని జాతీయ మీడియా చెబుతోంది. ఆ 13వ సంఖ్య వద‍్ద ఎవరైనా మరో ఎంపీ సంతకం చేస్తే రెబల్స్‌ సంఖ్య 20 అవుతుంది. 

రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న చర్చ ప్రకారం.. ఆ స్థానం పార్టీలో అత్యంత సీనియర్‌, పలుసార్లు ఎంపీగా గెలిచిన ఒక ప్రముఖ నేత కోసం ఉద్దేశపూర్వకంగా 13వ సంఖ్య వద్ద ఏ పేరూ రాయకుండా ఖాళీగా ఉంచినట్లు భావిస్తున్నారు. సరైన సమయంలో ఆ నేత రెబల్‌ వర్గంలో చేరి సంతకం చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పటివరకు రెబల్‌ వర్గం ఆ నేత పేరును వెల్లడించలేదు. టీఎంసీ కూడా ఎలాంటి అధికారిక వ్యాఖ్య చేయలేదు. జాతీయ మీడియా కథనాలు కూడా ఆ వ్యక్తిని కేవలం "సీనియర్ ఎంపీ" లేదా "పలుసార్లు ఎన్నికైన ఎంపీ"గానే పేర్కొంటున్నారు.

అందువల్ల "నంబర్ 13" ఎవరనే విషయంలో ప్రస్తుతం వస్తున్న పేర్లన్నీ ఊహాగానాలే. ఆ ఎంపీ బహిరంగంగా ముందుకు రావడం లేదా లేఖపై సంతకం చేయడం జరిగితేనే అసలు విషయం బయటపడే అవకాశం ఉంది.

తిరుగుబాటు ఎంపీల డిమాండ్ ఏంటి?
తిరుగుబాటు వర్గం తామే లోక్‌సభలో నిజమైన టీఎంసీ ప్రతినిధులమని చెబుతోంది. తమను ప్రత్యేక పార్లమెంటరీ వర్గంగా గుర్తించాలని కోరుతోంది. ఇప్పుడు తుది నిర్ణయం స్పీకర్ చేతుల్లో ఉంది. నిబంధనల ప్రకారం పత్రాలను పరిశీలించిన తర్వాత, ఎంపీలతో మాట్లాడిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారు.

అభిషేక్‌నే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు?
ఈ తిరుగుబాటుకు ప్రధాన కారణం ఎన్నికల్లో ఓటమి. తమ అభిప్రాయాలు, సూచనలను పార్టీ పట్టించుకోలేదని పలువురు సీనియర్ నేతలు ఆరోపిస్తున్నారు. ఎంపీల ఆగ్రహం చాలావరకు మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీపైనే.

పశ్చిమ బెంగాల్‌లో తర్వాత ఏమి జరగవచ్చు?
పార్టీ, ఎన్నికల గుర్తుపై ఆధిపత్యం కోసం పోరాటం జరగవచ్చు. ఈ 19 మంది ఎంపీలకు లోక్‌సభ స్పీకర్‌, ఎన్నికల సంఘం గుర్తింపు ఇస్తే, మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ వర్గాల తరహాలో వీరే “నిజమైన టీఎంసీ”గా గుర్తింపు పొందవచ్చు. అలా జరిగితే రాజీనామా చేయకుండానే పార్టీ ఎన్నికల గుర్తుపై హక్కు సాధించే అవకాశం ఉంటుంది.

పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం నుంచి మినహాయింపు పొందాలంటే ఎంపీలలో మూడింట రెండొంతుల మద్దతు అవసరం. 28 మంది ఎంపీలు ఉన్న టీఎంసీలో రెబల్స్‌ సంఖ్య మనకు తెలిసినంతవరకు 19. ఈ వర్గం కోరుకుంటే నేరుగా ఎన్డీఏకు మద్దతు ఇవ్వవచ్చు. లేదా భారతీయ జనతా పార్టీలో విలీనం కావచ్చు. తిరుగుబాటు నేతలు ఇప్పటికే ఢిల్లీలో కేంద్ర మంత్రి  భూపేందర్‌ యాదవ్‌ను కలిశారని సమాచారం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement