వైఎస్‌ జగన్‌ హెలికాప్టర్‌ను దిగనివ్వం.. కోటంరెడ్డి అనుచరుల అరాచకం | TDP MLA Kotam Reddy Supporters Over Action AT Nellore | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ హెలికాప్టర్‌ను దిగనివ్వం.. కోటంరెడ్డి అనుచరుల అరాచకం

Jun 29 2025 7:33 AM | Updated on Jun 29 2025 11:58 AM

TDP MLA Kotam Reddy Supporters Over Action AT Nellore

( ఫైల్‌ ఫోటో )

నెల్లూరు రూరల్‌లో టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి అనుచరుల అరాచకం 

జూలై 3న వైఎస్‌ జగన్‌ పర్యటనకు అడుగడుగునా అడ్డంకులు 

మూడుచోట్ల హెలిప్యాడ్‌కు స్థలం ఇవ్వకుండా బెదిరింపులు

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ పర్యటనకు టీడీపీ నాయకులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. అక్రమ కేసులు బనాయించి జైల్లో ఉంచిన మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డితో ములాఖత్‌కు వైఎస్‌ జగన్‌ జూలై 3న నెల్లూరుకు రానున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్‌ కోసం వైఎస్సార్‌సీపీ నాయకులు స్థలాన్ని పరిశీలిస్తుండగా నెల్లూరు రూరల్‌ టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అనుచరులు అడ్డుపడుతున్నారు. 

నెల్లూరు రూరల్‌ పరిధిలో వైఎస్సార్‌సీపీ నాయకులు మూడు వేర్వేరు ప్రైవేటు స్థలాలను చూడగా.. కోటంరెడ్డి అనుచరులు ఆయా భూముల యజమానులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అక్కడ ఉన్న నిర్మాణాలతో పాటు భూములపై వివాదాలు సృష్టిస్తూ భయభ్రాంతులకు గురిచేశారు. వైఎస్సార్‌సీపీ నేతలు శనివారం కొత్తూరు అంబాపురంలోని క్రైస్తవ మిషనరీ ఆధ్వర్యంలో నడిచే ఓ పాఠశాల మైదానాన్ని హెలిప్యాడ్‌ కోసం ఎంపిక చేశారు. స్కూల్‌ యాజమాన్యం అనుమతితో జిల్లా అధికారులకు దరఖాస్తు చేశారు. అయితే, ఎమ్మెల్యే కోటంరెడ్డి అనుచరులు మిషనరీ స్కూల్‌ వద్దకు వెళ్లి వీరంగం సృష్టించారు. ట్రస్ట్‌ భూముల్లో ప్రభుత్వ భూమి ఉందంటూ హడావుడి చేశారు. భవనాలను కూల్చేస్తామంటూ రాద్ధాంతానికి దిగారు. దీంతో స్కూల్‌ సంబం«దీకులు భయాందోళనకు గురై హెలిప్యాడ్‌కు స్థలం ఇవ్వబోమని చెప్పాల్సి వచ్చింది. 

వైఎస్‌ జగన్‌ జనాదరణ చూసి భయపడి..
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. 143 హామీలతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి గద్దెనెక్కిన టీడీపీ కూటమి ఆ హామీలు నెరవేర్చలేక తీవ్ర వ్యతిరేకత మూటకట్టుకుంది. దీనిని నిలదీస్తూనే మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్రంలో పర్యటనలు చేస్తుండడంతో రోజురోజుకు జనాదరణ పెరుగుతోంది. ఆయన నెల్లూరు జిల్లాకు వస్తున్నారని తెలియగానే సంఘీభావం తెలిపేందుకు వేలాదిమంది తరలివస్తారని టీడీపీ నేతల్లో భయం పుట్టింది. వైఎస్‌ జగన్‌ పర్యటనను అడ్డుకునేందుకు అవరోధాలు సృష్టిస్తున్నారు. హెలిప్యాడ్‌కు స్థలాలు ఇవ్వకుండా యజమానులను బెదిరిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement