
అవనిగడ్డ సీటు విషయంలో తీవ్ర అసంతృప్తితో టీడీపీ నేత మండలి బుద్ధ ప్రసాద్ రగిలిపోతున్నారు.
సాక్షి, కృష్ణా జిల్లా: అవనిగడ్డ సీటు విషయంలో తీవ్ర అసంతృప్తితో టీడీపీ నేత మండలి బుద్ధ ప్రసాద్ రగిలిపోతున్నారు. ఉమ్మడి అభ్యర్ధిగా తనకే వస్తుందని ఆశపడ్డ బుద్ధప్రసాద్.. తొలి జాబితాలో అవకాశం దక్కక పోవడంతో తీవ్ర నిరాశలో మునిగిపోయారు. పొత్తులో భాగంగా అవనిగడ్డ సీటు జనసేనకు ఇచ్చే అవకాశం ఉంది. అవనిగడ్డ సీటు తమకే కేటాయించాలని మండలి బుద్ధప్రసాద్, టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.
ఇప్పటికే అవనిగడ్డ టీడీపీ నేతలు,కార్యకర్తలు ఏకగ్రీవ తీర్మానం చేసి చంద్రబాబు, పవన్కు పంపించగా, అవనిగడ్డ తమ్ముళ్ల డిమాండ్ను చంద్రబాబు పట్టించుకోలేదు. సీటు దక్కే అవకాశం లేకపోవడంతో పార్టీ కార్యక్రమాలకు బుద్ధ ప్రసాద్ దూరంగా ఉంటున్నారు. దీంతో అక్కడ టీడీపీ క్యాడర్ నైరాశ్యంలో కూరుకుపోయింది. మరో వైపు, కృష్ణా జిల్లాలో టీడీపీకి మరోషాక్ తగలనుందనే ప్రచారం జరుగుతోంది. పార్టీ మారే యోచనలో బుద్ధ ప్రసాద్ ఉన్నట్లు సమాచారం.
‘‘తన పేరు ప్రకటించనందుకు నేను మహదానందంగా ఉన్నానని.. పంజరంలోంచి బయటకు వచ్చిన పక్షిలాగా స్వేచ్ఛాస్వాతంత్య్రాలు పొందినట్లుగా ఉందంటూ బుద్ధ ప్రసాద్ గతంలో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘నేను పదవుల కోసం పుట్టలేదు. రాజకీయాలు మన కళ్లముందే మారిపోయాయి. డబ్బు రాజకీయాలకు ప్రధానమైపోయింది. ధనవంతుల కోసమే పార్టీలు అభ్యర్ధులుగా అన్వేషిస్తున్నాయంటూ చంద్రబాబుపై ఆయన పరోక్ష విమర్శలు చేశారు.
ఇదీ చదవండి: పొత్తుల పితలాటకం