సాక్షి, చెన్నై : ‘‘రాష్ట్రంలో ప్రభుత్వం మారిన కేవలం ఒక్క నెలలోనే తమిళనాడు పాతాళంలోకి పడిపోయే పరిస్థితి వచ్చింది. పరిశ్రమలు, వ్యాపార సంస్థలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. తమిళనాడులో ఏ క్షణంలోనైనా ఎన్నికలు రావచ్చు. దీనికి మనం వంద శాతం సిద్ధంగా ఉండాలి’’ అని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్మరో వ్యాఖ్యలు చేశారు. చెన్నైలోని వానగరంలో స్టాలిన్ సమక్షంలో, అన్నాడీఎంకే మాజీ మంత్రి బెంజమిన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు డీఎంకె పారీ్టలో చేరారు.
బెంజమిన్ అన్నాడీఎంకేలో చేరి ఎన్నో ఏళ్లుగా నిజాయితీగా పనిచేశారని గుర్తు చేస్తూ, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు,తాను ప్రతిపక్ష వరుసలో కూర్చునేవాడినని, తాము ప్రశ్నలు అడిగే సమయంలో ఎంతో మంది మంత్రులు సమాధానాలు చెప్పేవారని, అయితే, బెంజమిన్ సమాధానం చెబుతున్నారంటే మాత్రం తాము కాస్త అప్రమత్తంగా ఉండేవాళ్లమన్నారు. డీఎంకేలో చేరుతున్నవారంతా పదవుల కోసమో, హోదా కోసమో రాలేదని, సిద్ధాంతమే ముఖ్యం అనే భావనతో వస్తున్నారన్నారు. డీఎంకే బలంగా ఉంటేనే తమిళనాడును కాపాడుకోగలమని నమ్మి ఈ ఉద్యమంలో చేరుతున్నారన్నారు.
పాతాళంలోకి తమిళనాడు
గతంలో తాము చేసిన అభివృద్ధి,సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ, తాజాగా రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో తమిళనాడు పాతాళానికి నెట్టబడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ కొత్త ప్రభుత్వాన్ని నమ్మి తమిళనాడుకు రావడానికి పెట్టుబడి దారులు భయపడుతున్నారన్నారు.నేరాలు మరింతగా పెట్రేగి ఉన్నాయని పేర్కొంటూ, రాష్ట్రంలో అద్వన్నపు పాలన జరుగుతోందని ధ్వజమెత్తారు. మూడు నెలల తర్వాత లేదా ఆరు నెలల తర్వాత తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు రావచ్చు అని వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు ఇక్కడ పరిస్థితులు ఉన్నాయని పేర్కొంటూ, పార్టీ విజయానికి ఈ నిమిషం నుంచే కష్టపడటం ప్రారంభిద్దాం, శ్రమిద్దాం, పనిచేద్దాం అని ప్రతిజ్ఞ చేద్దామని పిలుపు నిచ్చారు.


