అసెంబ్లీ ఎన్నికల వేళ.. సుప్రీంకోర్టులో శరద్‌ పవార్‌ ఎన్సీపీకి భారీ షాక్‌ | Supreme Court Setback For Sharad Pawar, Ajit Pawar Can Continue Using Clock Symbol | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ ఎన్నికల వేళ.. సుప్రీంకోర్టులో శరద్‌ పవార్‌ ఎన్సీపీకి భారీ షాక్‌

Oct 24 2024 3:52 PM | Updated on Oct 24 2024 4:29 PM

Supreme Court Setback For Sharad Pawar, Ajit Pawar Can Continue Using Clock Symbol

న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు సుప్రీంకోర్టులో శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అజిత్‌ పవార్‌కు చెందిన ఎన్సీపీనే గడియారం గుర్తును కొనసాగించాలని సర్వోన్నత న్యాయస్థానం గురువారం వెల్లడించింది. అజిత్‌ పవార్‌ ఎన్సీపీ వర్గం పార్టీ గుర్తు గడియారం చిహ్నాన్ని ఉపయోగించకుండా నిషేధం విధాంచాలంటూ శరద్‌ పవార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీం ఈ ఆదేశాలు ఇచ్చింది.

అయితే ఎన్నికలు ముగిసే వరకు తమ ఆదేశాలను ఉల్లంఘించబోమని చెబుతూ నవంబర్‌ 6లోగా హామీ పత్రాన్ని దాఖలు చేయాలని అజిత్‌ వర్గాన్ని సుప్రీం ఆదేశించింది. తమ ఉత్తర్వులను ఉల్లంఘించి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవద్దని సున్నిహితంగా హెచ్చరించింది. 

అంతేగాక అజిత్‌ వర్గం గత ఆదేశాలకు కట్టుబడి ఉండాలని,  శరద్‌ పవార్‌ వర్గానికి నష్టం వాటిల్లకుండా చిహ్నాన్ని ఉపయోగించాలని తెలిపింది. ఈ విషయంలో కోర్టు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, ఒకవేళ తమ ఆదేశాలను ఉల్లంఘించినట్లు తేలితే సుమోటోగా స్వీకరించి చర్యలు చేపడతామని స్పష్టం చేసింది.

కాగా 2023లో అజిత్ పవార్ ఎన్సీపీలో  తిరుగుబాటు చేసి అధికార మహాయుతి కూటమిలో చేరిన విషయం తెలిసిందే. పార్టీలో చీలికత ర్వాత అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని వర్గాన్నే అసలైన ఎన్సీపీగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. అంతేకాకుండా, ఆ పార్టీ జెండా, ఎన్నికల గుర్తు (గడియారం)ను కూడా వారికే కేటాయించింది. శరద్‌ చంద్ర పవార్‌ వర్గానికి.. ‘బూరుగ ఊదుతున్న వ్యక్తి’ గుర్తును ఈసీ ఖరారు చేసింది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement