అమరావతి రైతుల్ని చంద్రబాబు మోసగించారు

Somu Veerraju Fires On Chandrababu - Sakshi

ఆ ఐదేళ్లలో రాజధాని కట్టలేదు

రైతులకు ఒక్క ప్లాటూ ఇవ్వలేకపోయారు

అమరావతి పేరుతో రూ.7,200 కోట్లు ఏం చేశారు

చంద్రబాబుపై బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఫైర్‌

సాక్షి, మచిలీపట్నం: చంద్రబాబు ఐదేళ్లలో రాజధానిని నిర్మించలేదని, భూములిచ్చిన రైతులకు ఒక్క ప్లాటు కూడా ఇవ్వలేకపోయారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధ్వజమెత్తారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అమరావతి పేరుతో చంద్రబాబు ఐదేళ్లలో రూ.7,200 కోట్లు ఖర్చు చేశారని, ఆ నిధులు దేనికి ఖర్చు చేశారో.. ఏం చేశారో తెలియదని అన్నారు. సింగపూర్, జపాన్, రష్యా అంటూ విదేశాల్లో జోరుగా తిరిగారని, ఎక్కడికి వెళితే అలా రాజధాని నిర్మిస్తామని చెప్పి ఐదేళ్లలో కట్టలేకపోగా.. రైతులను మోసం చేశారని మండిపడ్డారు.

బీజేపీ అధికారంలో ఉండుంటే కేవలం రూ.10 వేల కోట్లతో అద్భుత రాజధాని నిర్మించేవాళ్లమ న్నారు. రాజధాని నిర్మిస్తే కేంద్రం రూ.20 వేల కోట్లు ఇస్తామని చెప్పిందని, చంద్రబాబు ఆ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారని గుర్తు చేశారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం 7 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే.. కేవలం 3 లక్షల ఇళ్లకు పునాదులు వేసి వదిలేశారని వివరించారు. ఆ ఇళ్ల నిర్మాణం కోసం హడ్కో నుంచి రూ.4 వేల కోట్లు రుణం కూడా తీసుకున్నట్లు గుర్తు చేశారు. 

ఒక్క పోర్టయినా నిర్మించారా
రాష్ట్రంలో 900 కిలోమీటర్ల తీరప్రాంతం ఉంటే ఒక్కపోర్టయినా కట్టారా? అని వీర్రాజు ప్రశ్నించారు. 14 జెట్టీలు కట్టే అవకాశం ఉన్నా చంద్రబాబు ఒక్కటీ నిర్మించలేకపోయాడని దుయ్యబట్టారు. కేంద్రం ఒక్కో జెట్టీ నిర్మాణానికి రూ.600 కోట్లు ఇస్తుందని, అలా ఆరు జెట్టీలకు రూ.3,600 కోట్లు ఇస్తామని చెప్పి నట్లు గుర్తు చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top