ముంబై: శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ఆదివారం ‘ఆపరేషన్ టైగర్’పై వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేశారు. తమ పార్టీ చెక్కుచెదరకుండా, ఐక్యంగా, బలంగా ఉందని స్పష్టం చేశారు.
ఇటీవల ‘ఆపరేషన్ టైగర్’పై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గం ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలను తమవైపు లాగేందుకు ప్రయత్నిస్తోందనే ప్రచారాన్ని ప్రతిపక్షం "ఆపరేషన్ టైగర్"గా పేర్కొంటోంది. శివసేన పార్టీ ప్రచార చిహ్నం పులి (టైగర్) కావడంతో ఈ పేరును వాడుతున్నారు.
ఇటీవల వచ్చిన వార్తల ప్రకారం.. శివసేన (యూబీటీ)కి చెందిన కొందరు ఎంపీలు షిండే క్యాంప్లోని నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారనే ఊహాగానాల నేపథ్యంలో ఈ పదం ఎక్కువగా వినిపిస్తోంది. శివసేన (యూబీటీ) నాయకులను షిండే వర్గంలోకి తీసుకురావాలనే ప్రయత్నాలకు పెట్టిన రాజకీయ పేరే "ఆపరేషన్ టైగర్".
9 మంది ఎంపీల్లో ఏడుగురు..
కొన్ని కథనాల ప్రకారం.. యూబీటీ శివసేనకు చెందిన 9 మంది ఎంపీల్లో ఏడుగురు షిండే శివసేనతో సంప్రదింపులు జరుపుతున్నారని, వారంతా ఎన్డీఏలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం తమ ఎంపీలతో సమావేశం నిర్వహించిన తర్వాత సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడారు. పార్టీ ఐక్యతను చాటేందుకు “ఆపరేషన్ వుల్ఫ్” ప్రారంభిస్తామని చెప్పారు.
“మీరు ఏ ఆపరేషన్ టైగర్ గురించి అడుగుతున్నారు? మేమంతా పులులమే. మేము ఆపరేషన్ వుల్ఫ్ ప్రారంభించబోతున్నాం. మేము భయపడబోము. మా ఎంపీలంతా, పార్లమెంటరీ పార్టీ పూర్తిగా ఐక్యంగా, బలంగా ఉన్నాయి. అలాగే కొనసాగుతాయి” అని అన్నారు.
అంతకుముందు రోజున శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ఆదివారం ముంబైలో పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన సాధారణ సమావేశంలో శివసేన (యూబీటీ)కి చెందిన 9 మంది పార్లమెంట్ సభ్యులంతా పాల్గొన్నారని చెప్పారు. పలువురు ఎంపీలు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరతారన్న ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు.
సమావేశం తర్వాత విలేకరులతో మాట్లాడిన రౌత్.. నలుగురు ఎంపీలు ప్రత్యక్షంగా హాజరయ్యారని, మరో ఐదుగురు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారని చెప్పారు. ఈ సమావేశం పార్టీ సాధారణ సంస్థాగత కార్యక్రమంలో భాగమని, ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ ఊహాగానాలతో సంబంధం లేదని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ దినా పాటిల్, మాతోశ్రీలో జరిగిన శివసేన యూబీటీ ఎంపీల సమావేశానికి హాజరుకాలేదన్న ప్రచారాన్ని ఖండించారు.
మరోవైపు, శివసేన జాతీయ ప్రతినిధి షైనా ఎన్సీ, సంజయ్ రౌత్పై తీవ్ర విమర్శలు చేశారు. “మునిగిపోతున్న ఓడ”లాంటి రాజకీయ పార్టీలో చేరితే రాజకీయంగా దిగజారడమే జరుగుతుందని అన్నారు.


