కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) రెబల్ ఎంపీలు సోమవారం పార్టీ ఎన్నికల గుర్తుపై హక్కు సాధించేందుకు పోరాడతామని ప్రకటించారు. తాము టీఎంసీని వీడలేదని, దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. 20 మంది అసమ్మతి ఎంపీలు నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ)లో విలీనమవుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. సోమవారం మాత్రం మాట మార్చారు.
అరూప్ చక్రవర్తి మీడియాతో మాట్లాడుతూ.. “మేము టీఎంసీని వీడలేదు. టీఎంసీలోనే ఉన్నాం. పార్టీని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. అది ఎందుకు దెబ్బతిన్నదన్న చర్చ జరగడం లేదు. పార్టీ గుర్తు కోసం మేము పోరాడతాం. మా వద్ద 20 మంది సభ్యులు ఉన్నారు. గుర్తు కోసం ఎందుకు పోరాడకూడదు?” అని తెలిపారు.
రాజకీయ, న్యాయ పోరాటం దీర్ఘకాలం కొనసాగుతాయన్న సంకేతాలు ఇచ్చారు. ఈ తిరుగుబాటు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కొత్త దశకు నాంది పలికిందని చక్రవర్తి అన్నారు. “కొత్త ఆట మొదలైంది. ఖేలా హోబే” అని ఆయన అన్నారు. ఈ పరిణామం రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. 20 మంది రెబల్ టీఎంసీ ఎంపీలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి, తాము ఎన్సీపీఐలో విలీనమవుతున్నట్టు ప్రకటించినప్పటికీ అరూప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆ సమావేశంలో ఎంపీలు పార్లమెంట్లో ప్రత్యేక సీటింగ్ ఏర్పాటు కోరారు. దీంతో మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీ నుంచి శాసనసభ్యుల స్థాయిలో తమ విభజనను అధికారికంగా ప్రకటించినట్టైంది.
కోర్టును ఆశ్రయిస్తాం
ఆరు సార్లు ఎంపీగా ఎన్నికైన సుదీప్ బంద్యోపాధ్యాయ్ తిరుగుబాటు వర్గంలో చేరారు. తమదే నిజమైన టీఎంసీ అని నిరూపించేందుకు, పార్టీ జంట పువ్వుల ఎన్నికల గుర్తుపై హక్కు సాధించేందుకు కోర్టును ఆశ్రయిస్తామని ఆయన చెప్పారు. ఈ తిరుగుబాటుపై టీఎంసీ నాయకత్వం తీవ్రంగా స్పందించింది. పార్టీ వాదన ప్రకారం, పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం ఈ చర్య చెల్లదు. రాజ్యసభ ఎంపీ సాగరికా ఘోష్ మాట్లాడుతూ.. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం రాజకీయ పార్టీ ముందుగా విలీనం కావాలి లేదా విడిపోవాలి. ఆ తర్వాతే శాసనసభ్యులు అనర్హత నిబంధనల నుంచి మినహాయింపు కోరగలరని చెప్పారు.
ఎక్స్లో చేసిన పోస్టులో ఘోష్ స్పందిస్తూ.. “2/3 వంతుల మెజారిటీ, పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టంపై భారీ స్థాయిలో తప్పుడు సమాచారం ప్రచారంలో ఉంది. పదో షెడ్యూల్, సుప్రీంకోర్టు ఈ విషయంలో స్పష్టత ఇచ్చాయి. పార్లమెంట్ వెలుపల ఉన్న రాజకీయ పార్టీనే ముందుగా విడిపోవాలి లేదా విలీనం కావాలి. పార్లమెంట్లో కూర్చున్న పార్టీ ప్రతినిధులు కాదు. ఈ షరతు నెరవేరిన తర్వాతే 2/3 మంది విడిపోయినా పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం వర్తించదు” అని తెలిపారు.
సీనియర్ టీఎంసీ నేత సౌగత రాయ్ కూడా తిరుగుబాటు నేతలపై విమర్శలు చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పునకు వారు ద్రోహం చేశారని ఆరోపించారు. “ఇప్పుడు మమతా బెనర్జీ అధ్యక్షురాలిగా ఉన్న అఖిల భారత తృణమూల్ కాంగ్రెసే అసలైన పార్టీ అని స్పష్టమైంది. ఎన్నికల గుర్తు రెండు పువ్వులు. భారతీయ జనతా పార్టీని ఓడించడమే దాని లక్ష్యం” అని ఆయన చెప్పారు.
“టీఎంసీ గుర్తుపై ఎన్నికైన 20 మంది ఎంపీలు తమ ఓటర్లకు ద్రోహం చేస్తూ, నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా అనే పెద్దగా గుర్తింపు లేని పార్టీలో చేరారు. చట్టవిరుద్ధంగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏకు మద్దతు ప్రకటించారు. రాజ్యాంగంలోని షెడ్యూల్ 10(4) నిబంధనల నుంచి తప్పించుకోవడానికే వారు ఇలా చేశారు. ప్రజలు ఈ వార్తను గమనిస్తున్నారు” అని రాయ్ అన్నారు.
మమతా బెనర్జీపైన కూడా చక్రవర్తి నేరుగా విమర్శలు చేశారు. విభజన తర్వాత ఆమె ఒత్తిడిలో ఉన్నారని అన్నారు. “మమతా బెనర్జీ భయపడుతున్నారు. పార్టీ సమావేశం కూడా నిర్వహించలేకపోతున్నారు. ఎన్నికలకు ముందు సొంత నియోజకవర్గంలో కూడా సమావేశం నిర్వహించలేకపోయారు” అని ఆయన చెప్పారు.


