పోటీలో ఖర్గే సహా పలువురు మాజీ ముఖ్యమంత్రులు
కర్ణాటక నుంచి ఖర్గేకు అవకాశం ఖాయమంటూ ప్రచారం
తెరపైకి కమల్నాథ్, పవన్ఖేరా, అశోక్ గెహ్లాట్, భూపేశ్ బఘేల్ పేర్లు
మాజీ ముఖ్యమంత్రుల్లో ఒకరికి దక్కనున్న అవకాశం
సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో రాజ్యసభలో ఖాళీ అయ్యే 24 స్థానాల ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడటంతో కాంగ్రెస్లో అంతర్గత రాజకీయ చర్చలు ఊపందుకున్నాయి. రాజ్యసభలో చోటు దక్కించుకునేందుకు అవకాశమున్న కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్తాన్, జార్ఖండ్ రాష్ట్రాల్లో టిక్కెట్ల కేటాయింపుపై చర్చలు మొదలయ్యాయి. సీటు కోసం పలువురు మాజీ ముఖ్యమంత్రులు, సీనియర్ నేతల మధ్య పోటీ కన్పిస్తోంది. దీంతోపాటు, ఢిల్లీలోని 24 అక్బర్ రోడ్ ప్రాంతంలోని టైప్–7 ప్రభుత్వ బంగ్లాను కాంగ్రెస్ పేరుతోనే కొనసాగించే వ్యూహం కూడా అధిష్టానం వద్ద ఉంది.
కర్ణాటక నుంచి ఖర్గే బెర్త్ ఖరారు?
కర్ణాటకలోని నాలుగు సీట్లకు ఎన్నికలు జరుగనుండగా, ఇందులో కాంగ్రెస్కు కనీసం రెండింటి అభ్యర్థిత్వాలు ఖరారయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఈ రెండింటిలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు బెర్త్ దాదాపు ఖాయమైందని తెలుస్తోంది. మరో సీటు లింగాయత్ సామాజిక వర్గ నేతకు దక్కే అవకాశముందంటున్నారు. మూడో సీటుపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అదేవిధంగా, జార్ఖండ్లో జేఎంఎంతో ఉన్న పొత్తులో భాగంగా 2 సీట్లలో ఒకటి కాంగ్రెస్కు కేటాయించే అవకాశమున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
రాజస్థాన్లో మూడు సీట్లకుగాను కాంగ్రెస్ ఒక సీటును సులభంగా గెలుచుకునే అవకాశం ఉంది. ఈ సీటు కోసం ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయనతో పాటు పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పవన్ ఖేరా, సిట్టింగ్ ఎంపీ నీరజ్ డాంగీ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మధ్యప్రదేశ్ నుంచి మాజీ ముఖ్య మంత్రి కమల్ నాథ్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు జితు పట్వారీ పేర్లు తెరపైకి వచ్చాయి. సోనియా గాంధీ సహా పార్టీ అగ్రనేతలను ఇటీవల కమల్ నాథ్ కలిసి రాజ్యసభ నామినేషన్పై ఆసక్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
24 అక్బర్ రోడ్ బంగ్లాపై దృష్టి..
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రుల్లో ఒకరిని రాజ్యసభకు పంపే అవకాశాలను అధిష్టానం సీరియస్గా పరిశీలిస్తోంది. దీనికి రాజకీయ ప్రాధాన్యంతో పాటు వ్యూహాత్మక కారణా లూ ఉన్నట్లు చెబుతున్నారు. ప్రత్యేకంగా, ఢిల్లీలోని 24 అక్బర్ రోడ్ ప్రాంతంలోని టైప్–7 ప్రభుత్వ బంగ్లాను కొనసాగించుకోవడం కూడా ఈ నిర్ణయానికి ఒక కారణంగా భావిస్తున్నారు. సాధారణంగా మాజీ ముఖ్యమంత్రులకు ఇలాంటి వసతి కేటాయించే అవకాశం ఉండటంతో, కమల్ నాథ్, భూపేష్ బఘేల్, అశోక్ గెహ్లాట్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఢిల్లీలోని 24 అక్బర్ రోడ్ టైప్–7 బంగ్లా అధికారికంగా ఏ వ్యక్తి పేరుతోనూ కాకుండా, కాంగ్రెస్ పార్టీ కార్యాలయ వినియోగం కోసం కేటాయించిన ప్రభుత్వ వసతిగా ఉంది. ఇది గతంలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యాలయంగా ఉండేది. అయితే, కాంగ్రెస్ కొత్త ప్రధాన కార్యాలయం ఇందిర భవన్కు మారిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం ఈ బంగ్లాను ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసింది. దీంతో ఈ బంగ్లాను కొనసాగించుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి లేదా మాజీ కేంద్ర మంత్రిని రాజ్యసభకు పంపించి, వారి పేరుతో బంగ్లాను మళ్లీ తమ వద్దే ఉంచుకునే వ్యూహంలో అధిష్టానం ఉన్నట్లు గా కాంగ్రెస్ వర్గాలంటున్నాయి.


