
కలకత్తా: బెంగాల్లో నేడు పంచాయతీ ఎన్నికల సందర్భంగా మళ్లీ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో తొమ్మిది మంది మరణించారు. మృతుల్లో ఐదుగురు టీఎంసీ కార్యకర్తలు కాగా.. ఒకరు చొప్పున బీజేపీ, మరో ఇద్దరు కమ్యూనిస్టు, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వ్యక్తులు ఉన్నారు. ప్రత్యర్థి పార్టీలే ఈ ఘటనలకు కారణమని అన్ని రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి.
ఉదయాన్నే 7.00 గంటలకు పోలింగ్ ప్రారంభం అయింది. ఈ క్రమంలో అల్లర్లకు కేంద్ర స్థానమైన ముషీరాబాద్ జిల్లాలో టీఎంసీ కార్యకర్త బాబర్ అలీని దుండగులు హత్య చేశారు. అదే జిల్లాలోని రేజినగర్ ప్రాంతంలో టీఎంసీకి చెందిన మరో కార్యకర్త బాంబు దాడిలో మరణించగా.. ఖార్గ్రామ్ ఏరియాలో మరో కార్యకర్త మృతి చెందాడు. కూచ్ బిహార్ జిల్లాలో బీజేపీకి చెందిన మాదవ్ బిశ్వాస్ అనే కార్యకర్తను దుండగులు కాల్చి చంపారు. తూర్పు బర్దమాన్ జిల్లాలో సీపీఐఎమ్కు చెందిన మరో కార్యకర్త రజిబుల్ హోక్ తీవ్ర గాయాలతో మరణించాడు.
ఈ ఘటనలపై అధికార టీఎంసీ ప్రతిపక్షాలపై తీవ్ర ఆరోపణలు చేసింది. దాడులతో కార్యకర్తలను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టింది. అధికార పార్టీయే దాడులను ప్రోత్సహిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. అధికార బలంతో టీఎంసీ కార్యకర్తలు అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రతిపక్ష నాయకులు అన్నారు.
63,229 సీట్లకు పోలింగ్..
పశ్చిమ బెంగాల్లో 63,229 గ్రామ పంచాయతీ సీట్లకు నేడు ఎన్నికలు జరగుతున్నాయి. 9,730 పంచాయతీ సమితీలకు, 928 జిల్లా పరిషత్ స్థానాలకు ఎన్నికల అధికారులు పోలీంగ్ నిర్వహిస్తున్నారు. కాగా.. జులై 11న ఓట్ల లెక్కింపు జరపనున్నారు.
ఇదీ చదవండి: వర్షంలోనూ బారులు తీరిన ఓటర్లు.. బ్యాలెట్ పేపర్లకు నిప్పంటించిన దుండగులు..