రాజకీయ పార్టీని ఎలా పెట్టాలి? నియమ నిబంధనలేమిటి? | Election Commission of India - Know The Rules To Follow By Political Parties - Sakshi
Sakshi News home page

Rules of Election Commission: రాజకీయ పార్టీని ఎలా పెట్టాలి? నియమ నిబంధనలేమిటి?

Apr 3 2024 12:03 PM | Updated on Apr 3 2024 12:12 PM

Political Parties Know the Rules of Election Commission - Sakshi

దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు 18వ లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యాయి. అయితే రాజకీయ పార్టీ ఎలాపెట్టాలి? పేరు ఎలా నిర్ణయించాలి? పార్టీకి చిహ్నం ఎలా వస్తుంది? ఇందుకు ఎన్నికల సంఘం  ఎటువంటి నిబంధనలు  రూపొందించింది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. 

దేశంలో ఎవరైనా రాజకీయ పార్టీని స్థాపించిన తర్వాత, దానిని ఎన్నికల కమిషన్‌లో నమోదు చేయడం తప్పనిసరి. రాజకీయ పార్టీల ఏర్పాటుకు సంబంధించిన నిబంధనలను రాజ్యాంగంలోని ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లో పేర్కొన్నారు. దీనిప్రకారం రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడానికి, ఎన్నికల సంఘం జారీ చేసిన దరఖాస్తు ఫారాన్ని పూరించాలి. దీనిని ఆన్‌లైన్‌లో నింపాల్సి ఉంటుంది. ఆ తర్వాత దాని ప్రింటౌట్‌ను తీసుకుని, ఇతర ముఖ్యమైన పత్రాలు జతచేసి, 30 రోజుల్లోగా ఎన్నికల కమిషన్‌కు పంపాలి. రిజిస్ట్రేషన్‌ కోసం రూ.10వేలు ఫీజు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. 

పార్టీని ఏర్పాటు చేసినవారు ఎన్నికల కమిషన్‌ దరఖాస్తు ఫారంలో ఆ రాజకీయ పార్టీ పేరు ఏమిటి? దాని పని విధానం ఏమిటి? పార్టీ అధ్యక్షుడిని ఎలా ఎన్నుకుంటారు? అనే వివరాలతో పాటు పార్టీలో కీలకమైన పదవుల్లో ఉన్నవారి వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. పార్టీ సమర్పించే దరఖాస్తు ఫారంపై పార్టీలోని సభ్యులందరి సంతకాలు తప్పనిసరిగా ఉండాలి. పార్టీకి సంబంధించిన బ్యాంకు ఖాతా వివరాలను కూడా  తెలియజేయాల్సి ఉంటుంది. పార్టీ పేరును ఆ పార్టీ వ్యవస్థాపకులే నిర్ణయిస్తారు. అయితే ఆ పేరు చెల్లుబాటును ఎన్నికల సంఘం నిర్ణయిస్తుంది. ఎన్నికల సంఘం ఇప్పటికే అటువంటి పేరు నమోదు అయ్యిందో లేదో తనిఖీ చేస్తుంది. ఇప్పటికే  పార్టీపేరు నమోదై ఉంటే ఆ పేరుతో మళ్లీ పార్టీ రిజిస్టర్ కాదు. ఇలా జరిగినప్పుడు పార్టీ పేరును మార్చుకోవలసి ఉంటుంది. 

ఏదైనా రాజకీయ పార్టీని స్థాపించడానికి, దానిలో కనీసం 500 మంది సభ్యులు ఉండాలి. అంతే కాదు ఆ సభ్యులు ఏ ఇతర పార్టీతోనూ సంబంధం  కలిగివుండకూడదు. దీనికి సంబంధించిన అఫిడవిట్‌ను కూడా సమర్పించాలి. పార్టీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన అన్ని పత్రాలను పరిశీలించిన తర్వాత, ఎన్నికల సంఘం సదరు పార్టీకి గుర్తును ఇస్తుంది. అయితే దీనికి కొన్ని ప్రత్యేక నియమాలు కూడా ఉన్నాయి. 

ఎన్నికల చిహ్నాలను జారీ చేసే విషయానికి వస్తే ముందుగా కమిషన్ పార్టీకి ఒక గుర్తును జారీ చేస్తుంది. అయితే ఏ పార్టీ అయినా నిర్దిష్ట ఎన్నికల గుర్తును జారీ చేయాలని కూడా కోరవచ్చు. ఆ తర్వాత ఎన్నికల సంఘం దానిని పరిశీలిస్తుంది. ఒకవేళ ఆ ఎన్నికల గుర్తు ఏ పార్టీకీ కేటాయించకపోతే అప్పుడు దానిని జారీ చేస్తుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement