నూతన ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం | Oath taking of new MLCs | Sakshi
Sakshi News home page

నూతన ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం

Jun 14 2024 3:39 AM | Updated on Jun 14 2024 3:39 AM

Oath taking of new MLCs

స్థానిక సంస్థల కోటాలో నవీన్‌కుమార్‌రెడ్డి 

పట్టభద్రుల ఎమ్మెల్సీగా తీన్మార్‌ మల్లన్న 

మండలి చైర్మన్‌ చాంబర్‌లో ప్రమాణం 

సాక్షి, హైదరాబాద్‌:  ఎమ్మెల్సీలుగా ఎన్‌.నవీన్‌కుమార్‌రెడ్డి, తీన్మార్‌ మల్లన్న గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి చాంబర్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల కోటా ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి గెలుపొందిన నవీన్‌కుమార్‌రెడ్డి ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రులు మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్, సత్యవతి రాథోడ్‌తో పాటు పలువు రు మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనంతరం నవీన్‌కుమార్‌రెడ్డికి మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్‌ బండా ప్రకాశ్‌ పుష్ప గుచ్ఛం అందజేసి అభినందించారు. 

కాగా, తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు జరిగిన రోజు వెలువడిన ఫలితాల్లో తాను విజయం సాధించానని, తన గెలుపును తెలంగాణ అమరవీరులకు అంకితం చేస్తున్నానని ప్రకటించారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్, కేటీఆర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. 

ఎమ్మెల్సీగా తీన్మార్‌ మల్లన్న 
శాసన మండలి వరంగల్‌– ఖమ్మం– నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ తరఫున గెలుపొందిన తీన్మార్‌ మల్లన్న.. మంత్రి జూపల్లి కృష్ణారావు, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌, ఏఐసీసీ నాయకురాలు దీపాదాస్‌ మున్షీ  సమక్షంలో ప్రమాణం చేశారు. అనంతరం మండలి లాన్‌లో చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్‌ బండా ప్రకాశ్, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులుతో కలిసి  నూతన ఎమ్మెల్సీలు ఫొటోలు దిగారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement