‘భారత్‌’‌గా మారనున్న ఇండియా?.. ఆ హక్కు ఎవరికీ లేదు: శరద్‌ పవార్‌ | No One Has Right To Change Country's Name: Sharad Pawar | Sakshi
Sakshi News home page

‘భారత్‌’‌గా మారనున్న ఇండియా?.. ఆ హక్కు ఎవరికీ లేదు: శరద్‌ పవార్‌

Sep 5 2023 8:25 PM | Updated on Sep 5 2023 9:30 PM

No One Has Right To Change Country's Name: Sharad Pawar - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ వేదికగా ప్రతిష్ఠాత్మక జీ20 సదస్సు జరగనున్న తరుణంలో.. ‘ఇండియా’ పేరును ‘భారత్‌’గా మార్చనున్నారనే అంశం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యింది. సదస్సులో పాల్గొనే అతిథులు, ఇతర ప్రముఖులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఏర్పాటు చేయనున్న ప్రత్యేక విందుకు పంపిన ‘ఆహ్వానం’మే కారణమైంది. ఆహ్వానంపై ‘ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా’కు బదులు ‘ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌’ అని పేర్కొనడంపై రాజకీయ పార్టీలు, నేతలు, ప్రముఖులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. 

తాజాగా రాష్ట్రపతి ఇచ్చిన ఆహ్వాన లేఖలో ‘ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌’ అని మాత్రమే పేర్కొనడంతో.. ఇండియా పేరును ‘భారత్‌’గా మార్చనున్నారా..? అనే ప్రశ్నలు వస్తున్నాయి. దీనిని ప్రతిపక్షాలు సహా పలువురు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 1లో ‘ఇండియా, ఇది భారత్‌; రాష్ట్రాల సమాఖ్య’ అని ఉంటుందని, ఇప్పుడు యూనియన్ ఆఫ్ స్టేట్స్’ అనే పదం కూడా దాడికి గురవుతోందని కాంగ్రెస్ మంగళవారం ఆరోపించింది.
చదవండి: ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు ముందు కాంగ్రెస్ పార్టీ సమావేశం

నేషనలిస్టు కాంగ్రెస్‌ చీఫ్‌ శరద్‌ పవార్‌ తాజాగా స్పందించారు. దేశం పేరు మార్చే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని జల్గావ్‌ జిల్లాలో మీడియా సమావేశంలో పవార్‌ పాల్గొని మాట్లాడుతూ.. ‘దేశానికి సంబంధించిన పేరుపై అధికార పార్టీ ఎందుకు అంత కలవరపడుతోందో తనకు అర్థం కావడం లేదన్నారు. అయితే ‘రాజ్యాంగంలో ఇండియాను పేరు మార్చేందుకు అవకాశం ఉందా అని ప్రశ్నించగా.. దానిపై తనకు ఎలాంటి సమాచారం లేదు’ అంటూ బదులిచ్చారు. 

ఇండియా కూటమికి చెందిన అన్ని పార్టీల అధినేతల సమావేశం బుధవారం కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరగబోతోందని తెలిపారు. ఈ సమావేశంలో దేశం పేరు మార్పుపై చర్చ ఉంటుందని తెలిపారు.  దేశం పేరు మార్చే హక్కు ఎవరికీ లేదు. ఎవరూ పేరు మార్చలేరని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం త్వరలో పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల నిర్వహణకు సిద్ధమైన వేళ.. ఇండియా పేరును భారత్‌గా మారుస్తారన్న ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు జ‌రిగే ఈ స‌మావేశాల్లో న‌రేంద్ర మోదీ స‌ర్కార్ ఇండియా పేరును మార్చే ప్రతిపాద‌న‌ను పార్లమెంట్‌ సభ్యుల ముందుంచ‌నుంద‌ని తెలుస్తోంది. రాజ్యాంగ స‌వ‌ర‌ణ ద్వారా ఇండియా పేరును భార‌త్‌గా మార్చే ప్రక్రియ‌ను చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం  పావులు క‌దుపుతోంద‌ని వార్తలు వస్తున్నాయి.
చదవండి: మహిళా రిజర్వేషన్ బిల్లు.. ఎమ్మెల్సీ కవిత లేఖతో కదిలిన రాజకీయ పార్టీలు

Advertisement
 
Advertisement
Advertisement