ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు ముందు కాంగ్రెస్ పార్టీ సమావేశం | Ahead Of Special Session Congress Holds Parliamentary Strategy Meet | Sakshi
Sakshi News home page

ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు ముందు కాంగ్రెస్ పార్టీ సమావేశం

Sep 5 2023 9:24 PM | Updated on Sep 5 2023 9:24 PM

Ahead Of Special Session Congress Holds Parliamentary Strategy Meet - Sakshi

న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మంగళవారం సమావేశమయ్యారు. 10, జన్‌పథ్‌లోని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ నివాసంలో ఈ సమావేశం జరిగింది. సమావేశానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, అధిర్ రంజాన్ చౌదరి ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు.   

సెప్టెంబర్ 18-22 వరకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరగనున్నటు పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వాన్ని లక్ష్యం చేసుకుని ప్రతిపక్షాలు అమ్ములపొదిలో అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశాన్ని నిర్వహించింది. సమావేశాల ప్రధాన ఉద్దేశ్యం ఏమిటన్నది ప్రకటించలేదు కానీ అసెంబ్లీ, పార్లమెంటుకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే అంశమే ప్రధానాంశంగా సమావేశాలు జరుగుతాయని మాత్రం తెలుస్తోంది.

జమిలి ఎన్నికలు నిర్వహించే విషయమై సాధ్యాసాధ్యాలు అధ్యయనం చేసేందుకు కేంద్రం ఇప్పటికే మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఎనిమిది మంది సభ్యులతో కూడిన కమిటీని కూడా వేసింది కేంద్రం. ఈ కమిటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు అధీర్ రంజన్ చౌదరి, రాజ్యసభ మాజీ ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్, ఫైనాన్స్ కమిషన్ మాజీ ఛైర్మన్ ఎన్‌కె సింగ్, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ సి కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారిలు ఉండగా ప్రతిపక్ష నేత అధిర్ రంజాన్ చౌదరి ఈ కమిటీ నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు. 

త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే కేంద్రం జమిలి ఎన్నికల కోసం కమిటీ ఏర్పాటు చేసి హుటాహుటిన ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునిచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనికి సిద్ధపాటుగా ప్రత్యేక పార్లమెంటరీ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాల గురించి చర్చించేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఇండియా కూటమి ఎంపీలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.  

ఇది కూడా చదవండి: 'భారత్' అభివృద్ధి చెందుతున్న దేశాల స్వరం: ప్రధాని మోదీ

Advertisement
 
Advertisement
Advertisement