బ‌దిలీల పేరుతో ఉద్యోగుల‌కు కూటమి సర్కార్ వేధింపులు: చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి | Nalamaru Chandra Shekhar Reddy Fires On Chandrababu Govt | Sakshi
Sakshi News home page

బ‌దిలీల పేరుతో ఉద్యోగుల‌కు కూటమి సర్కార్ వేధింపులు: చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి

Jun 30 2025 5:19 PM | Updated on Jun 30 2025 5:34 PM

Nalamaru Chandra Shekhar Reddy Fires On Chandrababu Govt

సాక్షి, తాడేపల్లి: బదిలీల పేరుతో కూటమి సర్కార్ ఉద్యోగులపై వేధింపులకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ ఎంప్లాయీస్ అండ్‌ పెన్ష‌న‌ర్స్ వింగ్ రాష్ట్ర అధ్య‌క్షుడు న‌ల‌మారు చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల బదిలీలను సైతం కూటమి ఎమ్మెల్యేలు తమ అక్రమార్జనకు ఆదాయ వనరుగా మార్చుకుంటున్న దారుణమైన పరిస్థితి ఏపీలో నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే తొలిసారిగా గ్రామస్థాయికి పాలనను అందించేందుకు వైఎస్‌ జగన్ హయాంలో తీసుకువచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను సర్వ నాశనం చేస్తూ, అందులోని సిబ్బంది సంఖ్యను కుట్రపూరితంగా తగ్గించివేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే..

కూట‌మి ప్ర‌భుత్వంలో నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా ఉద్యోగుల బ‌దిలీలు జ‌రుగుతున్నాయి. ఎవ‌రు డ‌బ్బులిస్తే వారికి ఎక్క‌డికి కావాలంటే అక్క‌డికి వేగంగా బ‌దిలీలు జ‌రిగిపోతున్నాయి. అన‌ధికారికంగా బ‌దిలీల‌కు ఎమ్మెల్యేల సిఫార్సు లేఖ‌ల‌ను త‌ప్పనిస‌రి చేస్తూ రాజ‌కీయ జోక్యాన్ని పెంచుకుంటూ పోతున్నారు. దాదాపు 95 శాతం బ‌దిలీలు ఎమ్మెల్యేల సిఫార్సు లేఖ‌ల ద్వారానే జ‌రుగుతున్నాయి. గ్రామ వార్డు స‌చివాల‌యాల్లో ప‌నిచేస్తున్న దాదాపు 1.40 ల‌క్ష‌ల మంది ఉద్యోగుల‌ బ‌దిలీల కోసం జీవోఎంస్ నెంబ‌ర్ 5 ని విడుద‌ల చేశారు. వైయ‌స్సార్సీపీ హ‌యాంలో చివ‌రి ఏడాది నిబంధ‌న‌ల మేర‌కు ఉద్యోగుల బ‌దిలీలు జ‌రిగితే, కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక నాయ‌కులు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తూ బ‌దిలీల పేరుతో ఉద్యోగుల‌ను వేధిస్తున్నారు.

సచివాలయ వ్యవస్థపై కక్షసాధింపు
వైఎస్‌ జ‌గ‌న్ తీసుకొచ్చిన గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌కు మంచి పేరు రావ‌డంతో దాన్ని ఎలాగైనా నిర్వీర్యం చేయాల‌నే కుట్ర‌తో కూట‌మి ప్ర‌భుత్వం ప‌నిచేస్తోంది. ఇప్ప‌టికే సచివాలయాల్లో రేషనలైజేష‌న్ పేరుతో ఉద్యోగుల సంఖ్య‌ను త‌గ్గించిన ప్ర‌భుత్వం, కొత్తగా నియామ‌కాలు చేప‌ట్ట‌కుండా నిరుద్యోగుల‌కు అన్యాయం చేసింది. ఇప్పుడు స‌చివాల‌యాల్లో బ‌దిలీల పేరుతో ఉద్యోగుల‌ను వేరే మండ‌లాల‌కు బ‌ల‌వంతంగా పంపించి వేధిస్తున్నారు. గ్రామ స‌చివాల‌యాల్లో ప‌నిచేసే ఉద్యోగుల‌కు ఒక రూల్‌, ప‌ట్ట‌ణాల్లో వార్డు స‌చివాల‌యాల్లో ప‌నిచేసేవారికి వేరే రూల్ వ‌ర్తింప‌జేస్తున్నారు. బ‌దిలీల పేరుతో చిన్న‌స్థాయి ఉద్యోగుల‌ను డ‌బ్బుల కోసం ఒత్తిడికి గురిచేస్తున్నారు. ప్ర‌భుత్వ‌మే ఉద్యోగుల చేత త‌ప్పులు చేయించే కార్య‌క్ర‌మానిక ఉసిగొల్పుతున్న‌ట్టుంది.

ప‌నివేళ‌ల్లోనే బ‌దిలీలు పూర్తిచేయాలి
భ‌ర్త చ‌నిపోయి వితంతువులుగా ఉన్న ఉద్యోగుల‌కు, కేన్స‌ర్ వంటి వ్యాధుల‌తో ఇబ్బంది ప‌డేవారికి, స్పౌస్ కేస్‌ల్లో కోరుకున్న ప్రాంతాల‌కు బ‌దిలీ అయ్యే అవ‌కాశం ఉన్నా, వారి అభ్య‌ర్థ‌న‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. గ్రామ స‌చివాల‌యాల బ‌దిలీల‌కు జూన్ 30తో గ‌డువు ముగిసిపోయింది. నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే ఉద్యోగుల బ‌దిలీలు పూర్తి చేయాల‌ని వైయ‌స్సార్సీపీ ఎంప్లాయీస్ అండ్‌ పెన్ష‌న‌ర్స్ వింగ్ త‌ర‌ఫున ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నంద్యాల జిల్లాలో 12 రోజుల కింద‌ట డెలివ‌రీ అయిన ఒక బాలింత‌రాలు, ఒక మ‌హిళా ఉద్యోగిని కౌన్సిలింగ్ పేరుతో ఉద్యోగులు ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కూ కుర్చోబెట్టి వేధించ‌డంతో ఆమె అస్వ‌స్థ‌త‌కు గురై ఇంటికెళుతూ మార్గ‌మ‌ధ్య‌లో చ‌నిపోయింది. ఆమె కుటుంబానికి ఎవ‌రు న్యాయం చేస్తారు?  నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే ఆఫీసు వేళ‌ల్లోనే ఉద్యోగుల బ‌దిలీలు పూర్తి చేయాలి. రాత్రింబ‌వ‌ళ్లు తిప్పించుకుని వేధించ‌డం ఆపాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement