సాక్షి, హైదరాబాద్: ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తమ పార్టీ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్కుమార్రెడ్డిల అరెస్ట్ పరిణామంపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకంటే అరెస్టులు, అక్రమ నిర్బంధాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని మండిపడ్డారు.
హామీలన్నీ అమలు చేస్తామని ప్రభుత్వం చెబితే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా స్వచ్ఛందంగా అరెస్టయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ సవాల్ చేశారు. ‘మేము సిద్ధం.. మీరు సిద్ధమా?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మహిళల పట్ల ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవం ఉన్నా.. తమ పార్టీ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిపై జరిగిన ఘటనలో బాధ్యులపై తీసుకున్న చర్యలను వెల్లడించాలని డిమాండ్ చేశారు.
హైకోర్టు నిన్న స్పష్టమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ తాతా మధు, నవీన్రెడ్డిపై కావాలనే కేసులు పెట్టి అరెస్ట్ చేశారని కేటీఆర్ అన్నారు. ఈ వ్యవహారంతో ప్రభుత్వానికి కోర్టులు, చట్టాల పట్ల ఉన్న గౌరవం ఏమిటో అర్థమవుతోందని విమర్శించారు. ప్రజలు ప్రభుత్వ ‘డైవర్షన్ పాలిటిక్స్’ను గమనిస్తున్నారని పేర్కొన్నారు.
ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయలేకపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం, 1000 రోజుల్లో ఏమి సాధించింది అంటే, అరెస్టులు, అక్రమ నిర్బంధాలు.
హామీలు అమలు అవుతాయి అంటే - బీఆర్ఎస్ పార్టీ ఎమ్యెల్సీ లు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చి స్వచ్ఛందంగా అరెస్ట్ అవుతాము! మేము సిద్ధం, మీరు సిద్ధమా?
అలానే…— KTR (@KTRBRS) September 8, 2026
ఇదీ చదవండి: నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు: సాక్షితో తాతా మధు


