ఈ విషయాన్ని కేసీఆర్ చెప్పమన్నారు: కేటీఆర్‌ | KTR Criticism of Governments Anti Farmer Policies | Sakshi
Sakshi News home page

ఈ విషయాన్ని కేసీఆర్ చెప్పమన్నారు: కేటీఆర్‌

Jun 20 2026 3:08 PM | Updated on Jun 20 2026 3:21 PM

KTR Criticism of Governments Anti Farmer Policies

ఆదిలాబాద్‌: ప్రభుత్వం వ్యవసాయ వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. కల్లబొల్లి మాటలతో రైతులను మోసం చేస్తోందని విమర్శించారు. సిరికొండ మండలం పొన్నలో శనివారం కేటీఆర్‌ పర్యటించారు. రైతు పాండురంగ కుటుంబాన్ని పరామర్శించారు. 

‘‘రైతులు పండించిన ప్రతి పంటను తప్పకుండా ప్రభుత్వం కొనాల్సిందే. ఇలాంటి ఆత్మహత్యలను నివారించాల్సిన బాధ్యత మీపై ఉంది. ఎంతమంది రైతులు చనిపోయారో అంతమంది రైతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాల్సిందే. మెడలు వంచి నష్టపరిహారం వచ్చేలా చేస్తాం. వారికి ధైర్యం చెప్పడానికి వారి కుటుంబానికి అండగా మేమున్నామని ధైర్యాన్ని ఇవ్వడానికే ఇక్కడికి వచ్చాము. రెండు సంవత్సరాల్లో తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. అప్పటివరకు రైతులు ధైర్యంగా ఉండాలని కేసీఆర్ చెప్పమన్నారు’’ అని కేటీఆర్‌ తెలిపారు.

రైతులు భయపడుతున్నారు
వ్యవసాయం చేయాలంటేనే రైతులు భయపడుతున్నారని కేటీఆర్‌ చెప్పారు. రైతు పండించిన ప్రతి పంటను ప్రభుత్వం కొనాల్సిందేనని డిమాండ్‌ చేశారు. వారం రోజులు కల్లాల్లో పంట కొనుగోలు కోసం ఎదురుచూసి ఎవరూ కొనకపోవడం వల్ల అప్పుల వాళ్ల బాధ భరించలేక పాండురంగ ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. మృతుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

‘‘ప్రభుత్వం వ్యవసాయ వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పక్కనే ఉన్న మహారాష్ట్ర కన్నా ఆదిలాబాద్ పత్తి పంటలు సాగులో మొదటి స్థానంలో ఉండేది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుబంధు ఎంతోమంది రైతులకు ఆసరా అయింది. ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. మా పార్టీ తరఫున వారి కుటుంబానికి మూడు లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నాం.

 కానీ ప్రభుత్వం కూడా రైతులను ఆదుకోవాలి. రైతు బీమా ప్రీమియం కూడా కట్టలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. ఎలక్షన్లకు రాజకీయాలు చేద్దాం.. ఎలక్షన్లప్పుడు కొట్టుకుందాం.. ప్రజలు ఎవరికీ ఓటు వేస్తే వాళ్లు కుర్చీలో కూర్చుంటారు.. కానీ మా మీద కోపం రైతుల మీద తీయొద్దు. మీరు ప్రాణాలు తీసుకోవద్దు.. ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఎక్కడ రూ.500 బోనస్? అని ఎందుకు కొనరు? అని ప్రభుత్వాన్ని నిలదీయండి. మీకు అండగా మేముంటాం.. ఎవరూ బలిదానాలు చేసుకోవద్దు’’ అని కేటీఆర్‌ చెప్పారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement