
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై టీడీపీలో ఒకప్పటి క్రియాశీలక నేత, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబే తీసుకుంటున్నారా? లేక ఆయన ఇంకెవరైనా ఉన్నారా? అనే సందేహమూ వ్యక్తమైంది ఆయన్నుంచి!. అలాగే.. అమరావతి కోసం మరిన్ని భూములు సేకరించాలన్న టీడీపీ ప్రభుత్వ నిర్ణయాన్నీ తీవ్రంగా తప్పుపట్టారు ఆయన. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కాలంలోనే ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉండటం.. అదే సందర్భంలో వడ్డే శోభనాద్రీశ్వరరావు వంటి సీనియర్ నేతలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతుండడం!.
వాస్తవానికి వడ్డే టీడీపీకి పెద్ద వ్యతిరేకి కాదు.. వైఎస్సార్సీపీ మద్దతుదారు కూడా కాదు. వయసు కారణంగా సీరియస్ రాజకీయాలు చేయని ఈయన అప్పుడప్పుడు కొన్ని అంశాలపై మాత్రం స్పందిస్తున్నారు. తాజాగా ఆయనకు చంద్రబాబు తెలివిపై అనుమానం వచ్చింది. ఆయనతో సంబంధం లేకుండా ఎవరో నిర్ణయాలు తీసుకుంటున్నారని కూడా వ్యాఖ్యానించారు. అదెవరో చెప్పడానికి ఆయన సిద్ధపడలేదు కానీ.. బాబుగారి సుపుత్రుడు, మంత్రి లోకేశ్ అన్నది బహిరంగ రహస్యమే!. ఇటీవలి పరిణామాలు, మీడియా కథనాలు కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి!.
చంద్రబాబు పేరుకే ముఖ్యమంత్రి.. ప్రభుత్వాన్ని నడుపుతున్నది నారా లోకేశ్(Nara Lokesh) అన్నది తాజా కథనాల సారాంశం. రెడ్ బుక్ పేరుతో రాష్ట్రంలో అరాచకం మొదలైంది కూడా లోకేశ్ నేతృత్వంలోనే అనేది అందరికీ తెలిసిన విషయం. స్వచ్ఛాంధ్రప్రదేశ్లో పేరుతో చెత్త ఏరివేత వంటివి ముఖ్యమంత్రి చూసుకుంటుంటే.. లోకేశ్ ఏమో తన శాఖతో సంబంధం లేని కార్యక్రమాలకూ ముఖ్య అతిథిగా హాజరవుతుండడం వడ్డే వంటి వారికి అనుమానాలు వచ్చేందుకు ఆస్కారం కల్పిస్తున్నాయి!.
గుంతకల్లు సమీపంలోని బేతేపల్లి వద్ద 22 వేల కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఇంటిగ్రేటెడ్ రెన్యుబల్ ఎనర్జీ ప్రాజెక్టుకు లోకేశ్ శంకుస్థాపన చేయడం పెద్ద ఉదాహరణగా కనిపిస్తుంది. ఈ ప్రాజెక్టు జగన్ ప్రభుత్వం ఉండగా ఆమోదం పొందింది. ఇప్పుడు శంకుస్థాపన దశకు చేరుకుంది. అది వేరే సంగతి. ఈ ఇంధన ప్రాజెక్టుకు లోకేష్ మంత్రిత్వ శాఖలకు సంబంధం లేదు. అయినా ఇంత భారీ పెట్టుబడి పెట్టే ప్రాజెక్టుకు సాధారణంగా ముఖ్యమంత్రి స్థాయిలో శంకుస్థాపన జరుగుతుంది. అందులోను చంద్రబాబు ఇలాంటి అవకాశాన్ని వదులుకోరు. కాని అక్కడకు ఆయన వెళ్లలేదు. అదే టైమ్ లో కర్నూలు వద్ద స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ పేరుతో జరిగిన ఒక చిన్న ప్రభుత్వ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని ఉపన్యాసం చేశారు. ఊళ్లలో చెత్త ఎత్తుతున్నారా? అన్న ప్రశ్నలతోపాటు రోడ్లపై కూరగాయలు అమ్మే వారిని, బడ్డీ కొట్ల వారిని పలకరిస్తూ కాలక్షేపం చేయడం అందరిని విస్తుపరచింది.
కొద్దిరోజుల క్రితం తిరుపతి జిల్లా శ్రీసిటీలో ఎల్జీ పరిశ్రమ యూనిట్కు కూడా లోకేశే భూమి పూజ చేశారు. ఈ మధ్యకాలంలో లోకేశ్ తన ఇంటిలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారట!. ఇందులో రాష్ట్రం అంతటి నుంచి ప్రజల నుంచి వినతిపత్రాలను తీసుకుంటున్నారట. మంగళగిరిలో తన పేరు మీద ‘‘మన ఇల్లు- మన లోకేశ్’’ ఒక కార్యక్రమాన్ని కూడా నడుపుతున్నారు. ఆర్థిక శాఖ విషయాల్లోనూ లోకేశ్ జోక్యం పెరుగుతోందని, నిధుల విడుదల వంటివి కూడా ఆయన కనుసన్నల్లోనే నడుస్తున్నాయని తెలుస్తోంది. ప్రభుత్వ శాఖల్లో టెండర్ల ఖరారు, ఇతర వ్యవహారాలు కూడా లోకేశే చూసుకుంటున్నారని సచివాలయం వెళ్లివచ్చిన ఒక ప్రముఖుడు చెప్పారు. సచివాలయంలో, పార్టీ కార్యాలయంలోనూ లోకేశ్ హవానే నడుస్తోందంటున్నారు. ఇక ఇటీవలే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని భార్య నారా బ్రాహ్మణితో ప్రత్యేకంగా కలవడం తెలిసిందే.
చంద్రబాబు మాత్రమే కాదు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) పరిస్థితి కూడా ఏమీ భిన్నంగా లేదు. డీఫ్యాక్టో సీఎంగా వ్యవహరిస్తున్నా లోకేశ్ను ఉప ముఖ్యమంత్రి హోదాలోని పవన్ కల్యాణ్ సైతం పన్నెత్తు మాట అనలేకపోతున్నట్లు ప్రచారం. తాను ఉప ముఖ్యమంత్రి కాకుండా పవన్ అడ్డుపడ్డారని లోకేశ్ భావిస్తున్నారు. మరోవైపు పవన్ చంద్రబాబు 15 ఏళ్లు సీఎంగా ఉండాలని కొన్ని సందర్భాల్లో చెప్పినా అది మొక్కుబడి మాట మాత్రమే. చంద్రబాబు తన కుటుంబం నుంచి వచ్చే ఒత్తిడితో లోకేశ్ను డిప్యూటీ చేసినా పవన్ చేసేదేమీ ఉండదు.
2014-19 మధ్యకాలంలో చంద్రబాబు ఎవరైనా తనను కలిసేందుకు వస్తే చినబాబు (మంత్రి లోకేశ్)ను కలవమని చెబుతుండే వారు. విపక్షంలో ఉండగా లోకేశ్ ‘యువగళం’ యాత్రలో పార్టీ అధ్యక్షుడితో సంబంధం లేకుండా సొంతం పలు హామీలు గుప్పించారు కూడా. అయితే.. 2024లో అనూహ్యంగా అధికారం దక్కడంతో ఆయన రెడ్ బుక్ అమలుకు ఒక ప్రత్యేక బృందాన్నే ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. లోకేష్ హోం మంత్రి కాకపోయినా ఆ శాఖ మొత్తం ఆయన అధీనంలోనే ఉందని అంటారు.
లోకేశ్ను ఇప్పటికే కొంతమంది సకల శాఖల మంత్రిగా వ్యాఖ్యానిస్తున్నారు. తాజా మహానాడులో లోకేష్ను పార్టీ వర్కింగ్ అధ్యక్షుడిగా చేయవచ్చన్నది ఒక టాక్. అదే జరిగితే ప్రభుత్వంతో పాటు, పార్టీ కూడా పూర్తిగా ఆయన చేతిలోకి వెళ్లిపోతుంది.
ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబే ఒక బ్రాండ్ అని లోకేశ్ చెబుతుండొచ్చు. కానీ.. ఆ పేరుతో ఆయన తన సొంత బ్రాండ్ను నిర్మించుకుంటున్నారని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. లోకేశ్ను ముఖ్యమంత్రిని చేసే విషయంలో చంద్రబాబుపై కుటుంబపరమైన ఒత్తిడి ఉందని అంటారు. కానీ ఆయన ఎందువల్లో ఆ నిర్ణయం తీసుకోలేక పోతున్నారు. ప్రజలు ఏమనుకుంటారో అనే భయమూ ఉండి ఉండవచ్చు. పవన్ కల్యాణ్ను గుడ్ హ్యూమర్లో ఉంచడానికి చంద్రబాబు,లోకేష్ లు ప్రయత్నిస్తున్నారు. దానికి పవన్ కూడా సంతృప్తి చెంది.. ప్రభుత్వపరంగా ఏ అరాచకం జరుగుతున్నా, ఎన్ని తప్పులు చోటు చేసుకుంటున్నా నోరు మెదపడం లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో లోకేశ్కు అధికారికంగా పట్టాభిషేకం జరగలేదు కాని, అటు ప్రభుత్వం, ఇటు పార్టీని తన గుప్పెట్లో పెట్టుకుని చంద్రబాబును నామమాత్రంగా చేశారన్న అభిప్రాయం ప్రజలలో ఏర్పడడం విశేషం.

:::కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.