భార్య బలవన్మరణానికి పాల్పడుతుండగా భర్త సూచనలు
కిటికీలో నుంచి వీడియో తీస్తూ పైశాచికానందం
వైఎస్ఆర్ కడప జిల్లా: ఓ పైశాచిక భర్త కట్టుకున్న భార్యను చిత్రవధకు గురిచేశాడు. మానసికంగా వేధించి.. ఆత్మహత్యకు ప్రేరేపించాడు. ఆమె బలవన్మరణానికి పాల్పడబోతే నివారించాల్సింది పోయి సెల్ఫోన్లో వీడియో చిత్రీకరిస్తూ ఉరి ఇలా వేసుకోవాలంటూ మానసికంగా మరింత కుంగదీశాడు. ఉరి బిగుసుకుని బాధితురాలు దుర్మరణం పాలైంది. వైఎస్సార్ కడప జిల్లా రాజంపేట మండలంలోని బోయనపల్లెలో జరిగిన ఈ అమానుష ఘటన తీవ్ర కలకలం రేపింది.
పోలీసుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీరామ్ శ్రీనివాస్ నందలూరు రైల్వే కేంద్రంలో లోకోపైలట్గా పనిచేస్తున్నారు. ఆయన రెండో భార్య కృష్ణవేణి తన నివాసంలో గురువారం ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు. అయితే, భార్య ఆత్మహత్య చేసుకుంటుంటే ఆపాల్సిన భర్త, ఆ దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించడం అతనిలోని క్రూరత్వాన్ని బయటపెట్టింది.
శ్రీరామ్ శ్రీనివాస్, కృష్ణవేణి దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. గురువారం కూడా ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన కృష్ణవేణి ఆత్మహత్య చేసుకుంటానని ఉరితాడు సిద్ధం చేసుకుంది. భర్త ఆమెను ఆపడానికి బదులు.. ‘ఉరి అలా కాదు, ఇలా వేసుకోవాలి‘ అంటూ సూచనలు చేస్తూ ఆ ఘటనను తన మొబైల్లో రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలోని సెల్ఫోన్ ఆధారాలను సేకరించిన పోలీసులు నిందితుడిని విచారణ చేస్తున్నారు.
ఈ ఘటనపై ఆగ్రహోదగ్రులైన కృష్ణవేణి బంధువులు నిందితుడిపై దాడికి యతి్నంచారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. గతంలో శ్రీనివాస్ తొలి భార్య కూడా తిరుపతిలో రైలు కింద పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు సమాచారం. కృష్ణవేణి మృతిపై మన్నూరు సీఐ లింగప్ప మాట్లాడుతూ.. భార్యాభర్తల మధ్య గొడవ జరిగిన సమయంలో కృష్ణవేణి తలుపు వేసుకుని ఆత్మహత్యకు యతి్నంచిందని, దానిని భర్త కిటికీలో నుంచి వీడియో తీసినట్లు అందులోని మాటలను బట్టి అర్థమవుతోందని చెప్పారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు.


