
దేశంలో లోక్సభ ఎన్నికల వేడి అంతకంతకూ పెరుగుతోంది. ఎన్నికల్లో గెలుపొందేందుకు అభ్యర్థులు వినూత్న ప్రచారాలు సాగిస్తున్నారు. యూపీలోని అలీగఢ్లో ఓ అభ్యర్థి చేస్తున్న ప్రచారతీరును చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.
ఎవరి మెడలోనైనా చెప్పుల దండను వేశారంటే వారిని అవమానించారని అర్థం. ఇటువంటి ఉదంతాలు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. అయితే అలీగఢ్లో స్వతంత్ర అభ్యర్థి పండిట్ కేశవ్ దేవ్ గౌతమ్ చెప్పుల దండ వేసుకుని ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. పూల దండకు బదులు చెప్పుల దండ వేసుకుని ఓట్లు అడగటాన్ని చూసి, స్థానికులంతా తెగ ఆశ్చర్యపోతున్నారు.
స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన పండిట్ కేశవ్ దేవ్కు ఎన్నికల సంఘం చెప్పు గుర్తును కేటాయించింది. ఈ నేపధ్యంలో కేశవ్ తన మెడలో ఏడు చెప్పులతో కూడిన దండతో ప్రచారం సాగిస్తున్నాడు. అవినీతిని అరికడతానంటూ అందరికీ చెబుతున్నాడు.
పండిట్ కేశవ్ దేవ్ సమాచారం హక్కు(ఆర్టీఐ) కార్యకర్త. ఆయన భారతీయ హిందూ రాష్ట్ర సేన, అవినీతి నిరోధక సేన అనే సంస్థలను కూడా నడుపుతున్నారు. కేశవ్ గతంలో రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిని ఎదుర్కొన్నారు.
అలీఘర్ లోక్సభ స్థానానికి రెండో దశలో అంటే ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియగా, మొత్తం 14 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. మార్చి 28 నుంచి ఏప్రిల్ 4 వరకు మొత్తం 21 మంది నామినేషన్లు దాఖలు చేశారు.
#WATCH | Aligarh, UP: Independent candidate from Aligarh Pandit Keshav Dev has been allotted 'slippers' as the election symbol. After which, he was seen carrying out the election campaign wearing a garland of 7 slippers around his neck. (08.04) pic.twitter.com/V0Hm8JYRmC
— ANI (@ANI) April 8, 2024