భారతీయ టెలివిజన్ చరిత్రలో ‘మహాభారతం’ సీరియల్లో ద్రౌపదిగా నటించి, యావత్ దేశాన్ని అలరించిన నటి రూపా గంగూలీ ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆ పౌరాణిక గాథలో అన్యాయాన్ని ఎదిరించినట్లే, ఇప్పుడు సోనార్పూర్ సౌత్ నియోజకవర్గానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించేందుకు బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈ ఎన్నికలను ‘చెడుపై మంచి సాగిస్తున్న ధర్మయుద్ధం’గా ఆమె అభివర్ణించడం అందరి దృష్టిని ఆకర్షించింది.
కురుక్షేత్రం తరహాలో బెంగాల్ రాజకీయాలు
ప్రస్తుత రాజకీయ పరిస్థితులను రూపా గంగూలీ కురుక్షేత్ర యుద్ధంతో పోల్చారు. ‘ఇది ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న పోరాటం. అంతిమంగా సత్యమే గెలుస్తుంది (సత్యమేవ జయతే)’ అంటూ ఆమె ధీమా వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా బెంగాల్ ప్రజలు పాలనాపరమైన వైఫల్యాలతో సతమతమవుతున్నారని, సామాన్యులకు కనీస సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా తాను ఈ పోరులో నిలబడినట్లు ఆమె స్పష్టం చేశారు.
ఓటర్ల జాబితాలో ఇన్ని లోపాలా?
ఎన్నికల వ్యవస్థలోని లోపాలపై రూపా గంగూలీ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో తీవ్రమైన అవకతవకలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. ముఖ్యంగా 2002 నుంచి ఇప్పటివరకు మరణించిన వారి పేర్లు ఓటర్ల జాబితాలో ఇంకా కొనసాగడంపై ఆమె అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఎన్నికల కమిషనర్ నియామకంలో ప్రతిపక్షాల వాదనకు చోటు కల్పించడం వల్ల పారదర్శకత పెరుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో విఫలమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సొంత గడ్డ.. తండ్రి కల
సోనార్పూర్ సౌత్ నియోజకవర్గంతో తనకు విడదీయరాని అనుబంధం ఉందని రూపా గంగూలీ గుర్తు చేసుకున్నారు. ‘మహాభారతం సీరియల్ ద్వారా వచ్చిన సంపాదనతో నా తల్లిదండ్రుల కోసం ఇక్కడే ఇల్లు కొన్నాను. దేశ విభజన సమయంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన నా తండ్రి పడ్డ కష్టాలు, ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి లేమి నాకు బాగా తెలుసు’ అంటూ ఆమె భావోద్వేగంగా స్పందించారు. ఈ వ్యక్తిగత అనుబంధమే తనను ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేలా ప్రేరేపించిందని రూపా గంగూలీ అన్నారు.
సంక్షేమ పథకాలే లక్ష్యం
ఎన్నికల హింసను అరికట్టి శాంతియుత వాతావరణంలో పోలింగ్ జరగాలని రూపా గంగూలీ కోరుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఆయుష్మాన్ భారత్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ)వంటివి అర్హులైన బెంగాల్ ప్రజలందరికీ చేరాలని ఆమె ఆకాంక్షించారు. ‘ద్రౌపది’గా గుర్తింపు పొందిన ఆమె, ఇప్పుడు సోనార్పూర్ సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఆసక్తికరంగా మారింది.
ఇది కూడా చదవండి: Bengal Politics: దీదీ ‘చేప’లకు మోదీ గాలం?


