తిరువనంతపురం: కేరళంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఫలితాలు వెలువడి దాదాపు వారం రోజులు గడుస్తోన్నా ఇంకా ముఖ్యమంత్రి ఎవరనే విషయం తేలలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళం ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేసీ వేణుగోపాల్ వైపు మెుగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయమై ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో జరిగిన అధికారిక భేటీకి ముందే రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్తో విడిగా సమావేశమైనట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవి అంశమై ఇరు నేతలు సుధీర్గంగా చర్చలు జరపునున్నట్లు సమాచారం. కాగా కేరళం ముఖ్యమంత్రి విషయంలో కాంగ్రెస్ నేతల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. వీడీ సతీశన్, రమేష్ చెన్నితల, కేసీ వేణుగోపాల్, శశిథరూర్లు సీఎం అభ్యర్థులుగా ప్రచారం జరిగింది.
కాగా ఇటీవల వేణుగోపాల్కు వ్యతిరేకంగా కేరళలో పోస్టర్లు వెలిశాయి. దీని వెనుక సతీశన్ హస్తం ఉందనే ఆరోపణలు రావడంతో రాహుల్ గాంధీ ఆయనను నేరుగా ప్రశ్నించారు. వేణుగోపాల్ సీఎం కావడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు సతీశన్ అంగీకరించారు. మెుదటి నుంచి వేణుగోపాల్ ఎంపికను మరో కీలక నేత వీడీ సతీశన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వేణుగోపాల్ తన పదవిని ఉపయోగించి గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని అధిష్టానం వద్ద సైతం ఫిర్యాదు చేశారు.
కాగా సతీషన్, రమేష్ చెన్నితల వంటి స్థానిక నేతలకు కేరళలో మంచి పట్టు ఉంది. ముఖ్యంగా ముస్లిం లీగ్ మద్దతు సైతం సతీశన్కు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇంత బలంగా సతీశన్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ హైకమాండ్ కేసీ వేణుగోపాల్ వైపే మెుగ్గు చూపుతున్నట్లు సమాచారం. రాబోయే రెండు రోజుల్లో పార్టీ శ్రేణులను ఒప్పించి కేసీ వేణుగోపాల్ను ముఖ్యమంత్రిగా ప్రకటించే దిశగా హైకమాండ్ ప్రయత్నాలు సైతం చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే స్థానిక నేతల వ్యతిరేకతను కాంగ్రెస్ ఎలా అధిగమిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కాగా 140 స్థానాలు ఉన్న కేరళ అసెంబ్లీలో యూడీఎఫ్ కూటమి 102 సీట్లు గెలుచుకుంది. ఇందులో కాంగ్రెస్ 63, ఐయూఎమ్ఎల్ 22 సీట్లు సాధించిన సంగతి తెలిసిందే.


