‘వాళ్ల మాటలు కోటలు దాటితే, చేతలు పకోడిలా ఉంటాయి’ | Harish Rao Satires On BJP Congress At Tellapur Double Bedroom House | Sakshi
Sakshi News home page

వాళ్ల మాటలు కోటలు దాటితే, చేతలు పకోడిలా ఉంటాయి: హరీష్‌ రావు సెటైర్లు

Sep 2 2023 2:05 PM | Updated on Sep 2 2023 3:08 PM

Harish Rao Satires On BJP Congress At Tellapur Double Bedroom House - Sakshi

సాక్షి, సంగారెడ్డి: బీజేపీ వాళ్ళకు మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ అని హరీష్‌ రావు మండిపడ్డారు. మాటలు కోటలు దాటుతాయి.. చేతలు పకోడిలా ఉంటాయని సెటైర్లు వేశారు. తెల్లపూర్ మున్సిపాలిటి పరిధిలోని కొల్లూరులో డబుల్ బెడ్ రూమ్‌ల ఇళ్ల పంపిణి కార్యక్రమం శనివారం జరిగింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న నియోజకవర్గ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను మంత్రి హరీష్ రావు, జిల్లా కలెక్టర్ శరత్ పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూం ఇండ్లు తీసుకున్న వారిలో సంతోషం కనపడుతుందన్నారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 60 లక్షల విలువైన ఇల్లు పేదల సొంతమయ్యాయని పేర్కొన్నారు. విలువైన స్థలంలో ధనవంతులు ఉండే ప్రాంతంలో పేద ప్రజలకు ఇండ్లు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని ప్రశంసించారు. కాంగ్రెస్, బీజేపీలు ఎప్పుడు ధర్నాలే చేస్తాయని, పనిచేయవని విమర్శించారు.

హైదరాబాద్ నలుమూలలా లక్ష డబుల్ బెడ్ రూమ్‌లు ఇస్తున్నామన్నారు. ఇక్కడ ఇండ్ల వద్ద అన్ని వసతులు కల్పిస్తామని, ఆసుపత్రి, రేషన్ షాపుతో పాటు అన్ని సౌకర్యాలు అందిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించినట్టు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇలా అన్ని మతాలను గౌరవించే వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు.  ఆలయం, చర్చ్, మసీదు కూడా ఏర్పాటు చేస్తామని, ఫంక్షన్ హాల్లు నిర్మిస్తామని పేర్కొన్నారు.
చదవండి: మేడ్చల్‌ జిల్లాలో రాజకీయ సంద‘ఢీ’.. ప్రత్యర్థులెవరు?

‘బీఆర్ఎస్ సర్కార్ అంటే మాటలు తక్కువ పనులు ఎక్కువ. ఇప్పుడు మంచినీళ్లకు ధర్నాలు లేవు. తాగు నీరు సరఫరా మంచిగా జరుగుతుంది. బీజేపీ వాళ్ళు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎన్నో చెప్పారు. ఇల్లు పోతే ఇల్లు, బండి పొతే బండి ఇస్తామన్నారు. బండి పోతే బండి.. గుండు పోతే గుండు అన్నారు. బండి లేదు గుండు లేదు.

డబుల్ ఇంజిన్ సర్కార్‌లో ఎక్కడైనా డబుల్ బెడ్ రూమ్‌లు ఇచ్చారా ? వీరిది డబుల్ ఇంజన్ కాదు ట్రబుల్ ఇంజన్ సర్కార్. విలువైన ఇంటిని జాగ్రత్తగా కాపాడుకోండి. ఇల్లు ఇచ్చిన, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న కేసీఆర్‌ను ఆశీర్వదించండి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గేటెడ్ కమ్యునిటీగా మారనుంది’  అంటూ హరీష్‌ రావు వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రాజాసింగ్, దానం నాగేందర్, ప్రకాష్ గౌడ్, మాగంటి గోపీనాథ్, మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement