కమ్యూనిస్టులతో కలిసుంటే  బాగుండేది | Gutha Sukhender Reddy Comment on Revanth Reddy | Sakshi
Sakshi News home page

కమ్యూనిస్టులతో కలిసుంటే  బాగుండేది

Aug 26 2023 3:54 AM | Updated on Aug 26 2023 3:54 AM

Gutha Sukhender Reddy Comment on Revanth Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి కమ్యూనిస్టులు మిత్ర పక్షంగా ఉంటే బాగుండేదని, ఎన్నికలకు ముందు వామపక్షాలు దూరం కావడం బాధాకరమని మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ‘ఇండియా’, ‘ఎన్‌డీఏ’కూటములకు సమదూరం పాటిస్తున్నందునే కమ్యూనిస్టులతో మైత్రి సాధ్యం కాలేద ని తాను భావిస్తున్నానన్నారు.

మండలిలోని తన చాంబర్‌లో శుక్రవారం మీడియా ప్రతినిధులతో గుత్తా మాట్లాడారు. వామపక్షాలతో సీట్ల సర్దుబాటుపై బి. వినోద్‌ కుమార్, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి సంప్రదింపులు జరిపారని, వారికి నామినేటెడ్‌ పోస్టు లు కూడా ఇస్తామన్నారని గుత్తా తెలిపారు. కాగా, తాను ఉన్న పదవిని దృష్టిలో పెట్టుకుని కమ్యూనిస్టు పార్టీ నేతల వ్యాఖ్యలపై మాట్లాడబోనన్నారు. 

అవకాశమిస్తేనే గుత్తా అమిత్‌ పోటీ 
నల్లగొండ ఎంపీగా 2019లో తాను పోటీ చేస్తే విజయం సాధించేవాడినని, అయితే రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యక్ష రాజకీయాల నుంచి నామినేటెడ్‌ పదవులవైపు వచ్చానని గుత్తా వెల్లడించారు. తాను రాజకీయాల్లో కొనసాగినంత కాలం కేసీఆర్‌ వెంటే ఉంటానని, భవిష్యత్తులో ఆయనకు నచ్చకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని గుత్తా ప్రకటించారు.

తనకు శాసన మండలి చైర్మన్‌గా పదవీ కాలం చాలా ఉందని, సీఎం, తాను అనుకున్నంత కాలం ఆ పదవిలో కొనసాగుతానని పేర్కొన్నారు. తన కుమారుడు గుత్తా అమిత్‌రెడ్డి పార్టీ టికెట్‌ ఆశించిన మాట వాస్తమేనని, కానీ అవకాశం లేకుంటే పార్టీ మాత్రం ఏం చేస్తుందని అన్నారు.  

బట్టకాల్చి మీదేయడమే రేవంత్‌ పని 
బట్టకాల్చి ఎదుటి వారిపై వేయడమే పనిగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పనిచేస్తున్నారని గుత్తా అన్నారు. రెడ్లకు భయపడి బీఆర్‌ఎస్‌ మంత్రి పదవులు ఇచి్చందనేది అవాస్తవమని, ప్రస్తుత రాజకీయాల్లో క్వాలిటీ ఆఫ్‌ లీడర్‌ షిప్‌ పడిపోతోందని పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో సీనియర్లు కాకుండా జూనియర్ల రాజ్యం నడుస్తోందని గుత్తా సుఖేందర్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement