అభ్యర్థుల వడపోత షురూ | Sakshi
Sakshi News home page

అభ్యర్థుల వడపోత షురూ

Published Sat, Jul 1 2023 2:30 AM

Filtering of candidates begins in congress - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు గుర్రాలెవరన్న దానిపై కాంగ్రెస్‌ పార్టీ కసరత్తు ప్రారంభించింది. కర్ణాటక తరహాలోనే ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించేందుకు అప్పు డే వడపోత కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఏఐసీసీ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో పార్టీ తరఫున పోటీ చేయదగిన నాయ కుల పేర్లను రాష్ట్ర నాయకత్వం ఢిల్లీకి పంపినట్లు తెలుస్తోంది.

గతంలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వారు, ఆశావహులతో కూడిన జాబితా ఢిల్లీకి వెళ్లిందని సమాచారం. నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున పేర్లను పంపాలన్న ఏఐసీసీ సూచన మేరకు కసరత్తు చేసిన టీపీసీసీ... ఆ జాబితాను అధిష్టానా నికి పంపిందని, ఈ నెల 26న ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు రాహుల్, ఖర్గేలతో భేటీ కావడానికి ముందే ఈ జాబితా అక్కడకు వెళ్లిందనే చర్చ గాంధీ భవన్‌లో జరుగుతోంది.

ఈ జాబితాను త్వరలో ఏర్పాటు కాబోయే ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ (పీఈసీ) పరిశీలించిన అనంతరం కొన్ని మార్పుచేర్పులు చేసి స్క్రీనింగ్‌ కమిటీకి పంపుతుందని, ఈ జాబితా నుంచి అధిష్టానం పరిశీలన కోసం రెండు పేర్లు వెళతాయని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు.  

ముగ్గురి వరకు.. 
ఏఐసీసీ సూచన మేరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల ఆశావహుల పేర్లను టీపీసీసీ ఢిల్లీకి పంపింది. ఇందులో 70కిపైగా స్థానాల్లో ముగ్గురి పేర్లు వెళ్లాయని, స్పష్టత ఉన్న స్థానాల్లో కేవలం ఒకే పేరు, మరికొన్ని చోట్ల రెండుపేర్లు వెళ్లాయని సమాచారం.

దీంతోపాటు 2009, 2014, 2018లలో వరుసగా మూడుసార్లు ఓడిపోయిన నేతలున్న నియోజకవర్గాల్లో కొత్త పేర్లు వెళ్లాయని, అక్కడ కొత్త వారికి అవకాశం ఇచ్చేందుకు ఏఐసీసీ మొగ్గుచూపుతోందని అంటున్నారు. మొత్తంమీద ఎన్నికలకు మరో ఐదు నెలల సమయం ఉండగానే ఏఐసీసీ అభ్యర్థుల జాబితా కోరడం రాష్ట్ర కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.  

Advertisement
Advertisement