పాతిక కేసులు పెట్టుకోండి: రాహుల్‌ | File 25 more cases: Rahul Gandhi dares Assam police | Sakshi
Sakshi News home page

పాతిక కేసులు పెట్టుకోండి: రాహుల్‌

Jan 25 2024 5:45 AM | Updated on Jan 25 2024 5:45 AM

File 25 more cases: Rahul Gandhi dares Assam police - Sakshi

బుధవారం అసోంలోని బొంబైగావ్‌లో ఓ చిన్నారితో రాహుల్‌ ముచ్చట్లు

బార్పేట(అస్సాం): అస్సాంలో హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌ తనపై మోపిన కేసులకు భయపడేది లేదని రాహుల్‌ గాంధీ స్పష్టంచేశారు. నాగాలాండ్‌ నుంచి అస్సాంలోని గువాహటిలోకి భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర అడుగుపెట్టకుండా పోలీసులు అడ్డుకున్నపుడు జరిగిన ఘర్షణలకు రాహుల్‌ కారకుడంటూ హిమంత సర్కార్‌ కేసులు పెట్టడం తెల్సిందే.

అస్సాంలో ఏడురోజుల యాత్ర బర్‌పెటా జిల్లా కేంద్రంలో బుధవారం ప్రారంభించిన సందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన తొలి బహిరంగ సభలో సీఎంపై రాహుల్‌ విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘ కేసులు పెట్టి నన్ను బయపెట్టొచ్చన్న ఐడియా హిమంతకు ఎందుకు వచి్చందో నాకైతే తెలీదు. మీరు(హిమంత, పోలీసులు) ఎన్ని కేసులు పెడతారో పెట్టండి.

మరో పాతిక తప్పుడు కేసులు బనాయించండి. నేను అస్సలు భయపడను. బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌ నన్ను భయపెట్టలేవు’’ అని అన్నారు. హిమంతను అతిపెద్ద అవినీతి సీఎంగా అభివరి్ణంచారు. ‘‘ మీరు ఆయనతో మాట్లాడుతుంటే ఆలోపు మీ భూమి కొట్టేస్తారు. మీరు వక్కపలుకులు నమిలినంత తేలిగ్గా ఆయన సుపారీ బిజినెస్‌ కానచ్చేస్తారు. మీ జేబులో డబ్బు నొక్కేస్తారు. ఏకంగా కజిరంగా నేషనల్‌ పార్క్‌ స్థలాలనే సీఎం ఆక్రమించారు. సీఎంతో జాగ్రత్త’ అని జనాన్ని అప్రమత్తం చేశారు.

ఎన్నికలయ్యాక లోపలేస్తాం: సీఎం
మంగళవారం నాటి ఘర్షణలకు సంబంధించిన కేసులో రాహుల్‌ను లోక్‌సభ ఎన్నికల తర్వాత అరెస్ట్‌ చేస్తామని సీఎం హిమంత చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement