
న్యూఢిల్లీ:అస్సాం సీం హిమంత బిశ్వశర్మపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత,లోక్సభలో కాంగ్రెస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గౌరవ్ గొగొయ్ భార్య ఎలిజబెత్పై హిమంత చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ నేత రషీద్ అల్వీ తీవ్రంగా స్పందించారు. గొగొయ్ భార్యకు పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐతో సంబంధాలున్నాయని ఏ ఆధారాలతో మాట్లాడారని రషీద్ అల్వీ ప్రశ్నించారు.
ఒకవేళ ఇదే నిజమైతే ఎలిజబెత్పై ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదో చెప్పాలన్నారు. హిమంత సీఎంగా ఉండి ఇంత దిగజారడమేంటన్నారు.ప్రతిపక్షనేతలపై ఆరోపణలు చేయడానికి ఓ పరిమితి ఉండాలని హితవు పలికారు.
కాగా,పాకిస్తాన్ జాతీయుడు అలీ షేక్పై కేసు నమోదు చేయాలని అస్సాం క్యాబినెట్ ఆదివారం డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.అయితే అలీషేక్ కాంగ్రెస్ నేత గౌరవ్గొగొయ్ భార్య,బ్రిటన్ జాతీయురాలు ఎలిజబెత్తో సంబంధాలు కలిగి ఉన్నారని, ఇది దేశ భద్రతకు ఏదైనా ముప్పు తెస్తుందా అన్నదానిపై విచారణ చేయాలని కూడా డీజీపీకి సూచించారు. దీనిపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది.