
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హస్తం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ.. విదేశీ వ్యవహారాల విభాగ అధ్యక్ష పదవికి ఆదివారం రాజీనామా చేశారు. తన రాజీనామాలో లేఖలో కీలక విషయాన్ని వెల్లడించారు. ఆ విభాగాన్ని పునర్వ్యవస్థీకరించి సమర్థులైన యువ నేతలకు అవకాశం కల్పించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. దీంతో, రాజీనామాకు ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా? అనే చర్చ నడుస్తోంది.
కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆనంద్ శర్మ తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంపించారు. ఈ సందర్భంగా తన లేఖలో ఆనంద్ శర్మ..‘ఈ బాధ్యతను నాకు అప్పగించినందుకు పార్టీ నాయకత్వానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ విభాగాన్ని పునర్వ్యవస్థీకరించి సమర్థులైన యువ నేతలకు అవకాశం కల్పించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని చెప్పుకొచ్చారు. ఇక, ఆనంద్ శర్మ.. ఏఐసీసీ విదేశీ వ్యవహారాల విభాగం అధ్యక్షుడిగా దశాబ్ద కాలం పనిచేశారు. పార్టీలో అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు ఆనంద్ శర్మ.. దాదాపు నాలుగు దశాబ్దాలుగా అంతర్జాతీయ వ్యవహారాలపై కాంగ్రెస్కు ప్రముఖ వ్యక్తిగా కొనసాగుతున్నారు. అయితే, ఆనంద్ శర్మ కాంగ్రెస్ సభ్యుడిగా కొనసాగనున్నారు.
Former Union Minister and Congress leader Anand Sharma has resigned from the post of the Chairman of Foreign Affairs Department of AICC. He continues to be a member of CWC.
(File photo) pic.twitter.com/RsIGBDgTOz— ANI (@ANI) August 10, 2025
గతంలో ఇండో-యుఎస్ అణు ఒప్పందం చర్చలలో ఆయన గతంలో కీలక పాత్ర పోషించారు. నిర్మాణాత్మక పద్ధతిలో భారత్-ఆఫ్రికా భాగస్వామ్యం, మొదటి భారత్-ఆఫ్రికా శిఖరాగ్ర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు.. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ వైఖరిని చాటిచెప్పేందుకు విదేశాలకు వెళ్లిన అఖిలపక్ష పార్లమెంటరీ ప్రతినిధులలో ఆయన కూడా సభ్యుడిగా ఉన్నారు. 2008 ముంబై ఉగ్రవాద దాడుల తర్వాత భారత్ వైఖరిని శర్మ ప్రపంచానికి స్పష్టంగా తెలియజేశారు. వాణిజ్య మంత్రిగా తన పదవీకాలంలో మొట్టమొదటి WTO ఒప్పందం, సమగ్ర వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేశారు.