టీడీపీలో టికెట్‌ పాలిటిక్స్‌.. నలుగురిలో సీటు ఎవరికి? | Competition Between Four People For TDP Ticket In Proddatur Ahead Of Assembly Elections In AP, See Details Inside - Sakshi
Sakshi News home page

టీడీపీలో టికెట్‌ పాలిటిక్స్‌.. నలుగురిలో సీటు ఎవరికి?

Dec 24 2023 5:20 PM | Updated on Dec 24 2023 6:57 PM

Competition Between Four People For TDP Ticket In Proddatur - Sakshi

టికెట్‌ కోసం టీడీపీ నేతల మధ్య నాలుగు స్తంభాలాట నడుస్తోంది

ప్రొద్దటూరు నియోజకవర్గం టికెట్ కోసం టీడీపీ నేతల మధ్య నాలుగు స్తంభాలాట నడుస్తోంది. ఒకే టికెట్ కోసం నలుగురు పోటీ పడుతున్నారు. ఎవరికి వారే టికెట్ తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసేవారికే టిక్కెట్ ఇస్తారని కొందరు నమ్మకం పెట్టుకున్నారు. అయితే, డబ్బు కట్టలు ఎక్కువగా ఇచ్చిన వారికే బాబు టికెట్ ఇస్తారని మరి కొందరు ధీమాగా ఉన్నారు. ఇంతకీ ప్రొద్దటూరులో టీడీపీ కోసం కష్టపడుతున్నదెవరు? డబ్బు కట్టలతో సిద్ధంగా ఉన్నదెవరు?..

ప్రొద్దటూరులో టీడీపీ టికెట్ రేసులో నలుగురు నేతలు  ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులు రెడ్డి, లింగారెడ్డి టికెట్ తమదే అని ఘంటాపథంగా చెబుతున్నారు. నాలుగేళ్లుగా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ప్రవీణ్ కుమార్ రెడ్డి అయితే ప్రొద్దటూరు టికెట్ కోసం ఎవరూ పోటీ పడాల్సిన అవసరమే లేదని.. ఆ టికెట్ తనకు ఇస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చేశారని ధీమాగా అంటున్నారు. నాలుగేళ్లుగా పార్టీ బలోపేతానికి చాలా కష్టపడ్డానని జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చిందని  ప్రవీణ్ కుమార్ రెడ్డి అంటున్నారు. ఈ ముగ్గురూ చాలరన్నట్లు మాజీ టీడీపీ నేత ప్రస్తుత బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తన సోదరుడు సీఎం సురేష్‌కు  ప్రొద్దటూరు టికెట్ ఇప్పించుకోడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్ కోసం నలుగురి మధ్య తీవ్ర పోటీ ఉండడంతో టికెట్ ఎవరికి ఇస్తారోనని కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు.

సీనియర్ నేత అయిన వరదరాజులు రెడ్డి కొద్ది వారాల క్రితం బాగా యాక్టివ్ అయ్యారు. నియోజకవర్గం అంతా కలియతిరిగేస్తూ వచ్చే ఎన్నికల్లో తననే గెలిపించాలని.. టికెట్ తనకే వస్తోందని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడికి అత్యంత నమ్మకస్తుడిగా మెలిగిన సీఎం రమేష్ ఈ మధ్యనే తన సోదరుడు సీఎం సురేష్‌ను తీసుకెళ్లి హైదరాబాద్‌లో చంద్రబాబుతో భేటీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ భేటీలోనే సురేష్‌కు టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు సుముఖత వ్యక్తం చేశారని సీఎం సురేష్ వర్గీయులు చెప్పుకుంటున్నారు.

గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తామని.. అందుకోసం సర్వేలు చేయిస్తున్నామని చంద్రబాబు నాయుడు చెబుతున్నప్పటికీ.. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికే చంద్రబాబు టికెట్ ఇస్తారని పార్టీ వర్గాలే అంటున్నాయి. ఈ లెక్క కరెక్ట్ అయితే ఈ నలుగురిలో ఎక్కువ డబ్బు విసరగల  సత్తా ఒక్క సీఎం రమేష్‌కే ఉందని నియోజక వర్గ పార్టీ నేతలే అంటున్నారు. సీఎం రమేష్‌ను మించి ఎక్కువ డబ్బులు ఇచ్చే సత్తా మిగతా ముగ్గురికీ లేదని వారంటున్నారు. చిత్రం ఏంటంటే టికెట్ ఎవరికి వచ్చినా వచ్చే ఎన్నికల్లోనూ ఇక్కడ టీడీపీకి గెలిచే అవకాశాలు లేనే లేవంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇక చంద్రబాబు ఎవరికి టికెట్ ఇస్తారన్నది చూడాలంటున్నారు విశ్లేషకులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement