‘ఆర్‌ఆర్‌ఆర్‌పై కిషన్‌రెడ్డి జవాబు చెప్పాలి’ | CM Revanth Lays Foundation for Multiple Development Projects in Uppal | Sakshi
Sakshi News home page

‘ఆర్‌ఆర్‌ఆర్‌పై కిషన్‌రెడ్డి జవాబు చెప్పాలి’

Jun 7 2026 8:18 PM | Updated on Jun 7 2026 8:18 PM

CM Revanth Lays Foundation for Multiple Development Projects in Uppal

హైదరాబాద్‌:  మూసీ మురికి కారణంగా ఉప్పల్‌ పరిధిలో ఉన్న భూముల రేట్లు పెరగడం లేదన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. మూసీ ప్రక్షాళన చేద్దామంటే అడ్డుపడుతున్నారని రేవంత్‌ పేర్కొన్నారు. ఉప్పల్ భగాయత్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంలో రేవంత్‌ మాట్లాడారు. ‘మేం మూసీ న‌ది ప్ర‌క్షాళ‌న చేయోద్దా..?, మూసీ మురికి కార‌ణంగా ఇక్క‌డ భూముల రేట్లు పెర‌గ‌డం లేదు. న‌ల్గొండ జిల్లాలో మూసీ కాలుష్యం వ‌ల్ల ఆనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. ఆడ‌బిడ్డ‌లు క‌డుపుకోతకు గురౌతార‌ని అక్క‌డి వాళ్లు బ‌య‌ట‌కు పంపుతున్నారు. 

మూసీ ప్ర‌క్షాళ‌న చేయ‌మ‌ని న‌ల్గొండ ప్ర‌జ‌లు నన్ను పిలిస్తే పాదయాత్ర చేశాను. మూసీలో ఇళ్లు పోయిన వారికి ఇళ్లు ఇస్తాం, చ‌దువు చెప్పిస్తామంటే అడ్డుప‌డుతున్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న వ్య‌క్తి ఈ రోజు మూసీకి అడ్డంప‌డుతున్నాడు. గుజరాత్‌లో సబర్మతి రివర్‌ ఫ్రంట్‌ కట్టుకున్నారు.

హైద‌రాబాద్ మెట్రో ఈ రోజు 9వ స్థానానికి ప‌డిపోయింది. మెట్రోను విస్త‌రించ‌డానికి అడ్డుప‌డుతున్నారు. మెట్రో విస్త‌రించాల‌న్న అవ‌స‌రం ఉందా లేదా అన్న‌ది ఆలోచించాలి. అన్ని అనుమ‌తులు వ‌చ్చాక కేంద్ర మంత్రి గా ప‌నిచేస్తున్న ఆయ‌న కాళ్ల‌లో క‌ట్టెలు పెట్టి ఆపుతున్నాడు. రీజ‌నల్ రింగ్ రోడ్డు వ‌స్తే ప్ర‌పంచంతోనే పోటీ ప‌డే అవ‌కాశం ఉంటుంది. 

రెండున్న‌ర యేళ్ల నుంచి రీజ‌న‌ల్ రింగ్ రోడ్డు కోసం యాభై సార్లు ఢిల్లీ వెళ్లా, మోదీని క‌లిశాను. స‌మాధానం చెప్పాల్సిన బాధ్య‌త కిష‌న్ రెడ్డికి లేదా..?, హైద‌రాబాద్ ప్ర‌జ‌లు కిష‌న్‌రెడ్డికి ఓట్లు వేయ‌లేదా..?, మెట్రోకు అనుమ‌తులు తెచ్చే బాధ్య‌త‌, మూసీకి నిధులు తీసుకువ‌చ్చే బాధ్య‌త కిష‌న్ రెడ్డికి లేదా..?, తెలంగాణ ప్ర‌భుత్వం 70 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నులు ధాన్యం కొనుగోలు చేసింది.. మిగిలిన 25 లక్షలు ఎవ‌రు కొనాలి. కేంద్రంతో ధాన్యం కొనుగోలు చేయించే బాధ్య‌త కిష‌న్ రెడ్డికి లేదా?, తెలంగాణ ప్ర‌జ‌లతో గోకున్నోడు బాగుప‌డిన‌ట్లు లేదు. 15 వ తేదీ త‌ర్వాత బ‌రాబ‌ర్ మా కార్యచరణ ఉంటుంది’ అని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement