మహబూబ్‌నగర్‌ నా గుండెల్లో ఉంటుంది: సీఎం కేసీఆర్‌ | Cm KCR Comments At Jadcherla BRS Public Meeting | Sakshi
Sakshi News home page

శ్రీశైలం ఎవరి అయ్య జాగీరు?: సీఎం కేసీఆర్‌

Oct 18 2023 4:52 PM | Updated on Oct 18 2023 6:42 PM

Cm KCR Comments At Jadcherla BRS Public Meeting - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌:  కృష్ణా జలాల్లో మన హక్కులు మనకు దక్కాలని పోరాటం చేశామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. పాలమూరు- రంగారెడ్డి పథకాన్ని జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు మార్చామని పేర్కొన్నారు. అప్పటి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు అడిగే ధైర్యం లేక జూరాల నుంచి నీళ్లను తీసుకొచ్చారని మండిపడ్డారు. ఇప్పుడు కూడా కొందరు జూరాల నుంచే నీళ్లు తీసుకోవాలని మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కృష్ణా జలాల్లో మన హక్కులు మనకు దక్కాలని పోరాటం చేశానని చెప్పారు. శ్రీశైలం ఎవరి అయ్య జాగీరని ప్రశ్నించారు.

9 ఏళ్ల తర్వాత అనుమతులు
జడ్చర్లలో బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. పాలమూరూరు ప్రాజెక్టును అడ్డుకునేందుకు కేసులు వేశారన్నారు. 9 ఏళ్ల తర్వాత అనుమతులు వస్తున్నాయన్నాయని తెలిపారు. మొన్ననే పాలమూరు పథకాన్ని ప్రారంభించానని, టన్నెల్స్‌ పూర్తయ్యాయి. మోటర్లను బిగిస్తున్నారని చెప్పారు. రాబోయే మూడు, నాలుగు నెలల్లో లక్షా 50 ఎకరాలను సాగునీళ్లు అందివ్వనున్నట్లు తెలిపారు. 

నీటి గోసపై ఉద్యమ సమయంలో పాట రాశా
మహబూబ్‌నగర్‌తో తనకున్న అనుంబంధాన్ని కేసీఆర్‌ గుర్తు చేసుకున్నారు. గతంలో మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఏ మూలకు పోయినా దుఖంతోనే పోయేదని అన్నారు. ఒకప్పుడు దుమ్ముకొట్టుకుపోయిన దుందుబి నది ఇప్పుడు జీవనదిగా మారిందని తెలిపారు. కృష్ణా నది పక్కనే ఉన్నా ఏం లాభం జరగలేదని, మహబూబ్‌నగర్‌ నీటి గోసపై ఉద్యమ సమయంలో నేను పాట రాశానని గుర్తు చేశారు.

కరువు అనే మాట ఉండదు
జిల్లాలో మార్పు రావాలనే ఎంపీగా పోటీ చేశానని  పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌ ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రాన్ని సాధింధించానని చెప్పారు. జిల్లా తన గుండెల్లో ఉంటుందని, పాలమూరు పాలుకారే జిల్లాగా మారుతుందని తెలిపారు. పరిశ్రమల కేంద్రంగా జడ్చర్లను తీర్చిదిద్దుతానని, ఇకపై ఇక్కడ కరువు అనే మాట ఇక ఉండదని హామీ ఇచ్చారు.
చదవండి: కాంగ్రెస్‌ పార్టీకి గద్వాల జిల్లా అధ్యక్షుడి రాజీనామా

కాంగ్రెస్‌ వస్తే రైతు బంధుకు రాంరాం అంటారు
‘తెలంగాణను మనకు ఎవరో ఇవ్వలేదు. ఆమరణ దీక్ష చేస్తే తప్ప తెలంగాణ రాలేదు. రాష్ట్రాన్ని ఉత్తిగా ఇవ్వలేదు. ఎంతో మంది విద్యార్థులను బలితీసుకొని ఇచ్చారు ఎప్పుడైనా రైతుబంధు లాంటి స్కీం విన్నామా?.  కాంగ్రెస్‌ వస్తే రైతు బంధుకు రాంరాం అంటారు. ఎన్నికల ముందు కర్ణాటకలో కాంగ్రెస్‌ 20 గంటలు కరెంట్‌ ఇస్తామని చెప్పింది. ఇప్పుడు కర్ణాటక సీఎం 5 గంటల కరెంట్‌ ఇస్తాం సరిపెట్టుకోండని అన్నారు. ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు 24 గంటల కరెంట్‌ ఎందుకు? 3 గంటలు చాలన్నాడు.’ అంటూ కేసీఆర్‌ మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement