
సాక్షి, అమరావతి: కడప టీడీపీ మహానాడు ఆద్యంతం తన కుమారుడు లోకేశ్ని తన వారసుడిగా చూపించేందుకు చంద్రబాబు తాపత్రయపడ్డారు. లోకేశ్ బాగా చదువుకున్నవాడని, అన్ని విషయాలు తెలిసినవాడంటూ ఆయన గురించే తన ప్రతి ప్రసంగంలోనూ చెప్పి పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయనే భవిష్యత్తు నాయకుడని పరోక్షంగా చెప్పారు.
మాములుగా అయితే మహానాడులో ఎప్పుడూ వివిధ అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టి వాటిపై చర్చించడం ఆనవాయితీగా జరిగేది. కానీ, ఈ మహానాడులో తీర్మానాలు దాదాపు పక్కకుపోయాయి. లోకేశ్ని గొప్పవాడిగా చూపించే క్రమంలో సూపర్ సిక్స్ హామీల తరహాలో సూపర్ సిక్స్ శాసనాలంటూ పాత అంశాలకే కొత్త పేర్లు పెట్టి ఆయనతో చెప్పించారు. మొదటి రోజు చర్చంతా ఆయన చెప్పిన అంశాలపైనే జరిగేలా చూశారు. ఈ శాసనాలు లోకేశ్ ఆలోచనలని, వీటి ద్వారా టీడీపీకి వచ్చే 40 ఏళ్ల వరకూ రూట్ మ్యాప్ రూపొందించినట్లు నమ్మించే ప్రయత్నం చేశారు. చంద్రబాబు తాను మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ ఈ శాసనాలు లోకేశ్ రూపొందించాడని, ఇవి అతని ఘనతేనని, వాటిని అందరూ పాటించాలని చెప్పుకొచ్చారు.
నిజానికి ఈ శాసనాల్లో ఏమాత్రం కొత్తదనంలేదు. యువత, మహిళలు, రైతులు, పేదలు, కార్యకర్తలకు మేలు చేయడం, తెలుగుజాతిని గొప్పగా నిలబెట్టడమే ఈ శాసనాలు. ఏ రాజకీయ పార్టీ అయినా వీటి గురించే చెప్పడం సాధారణమైన విషయం. ఎందుకంటే సమాజంలో ఉన్నది ఈ వర్గాలే. ఏం చేసినా ఆ వర్గాల కోసమే చేయాలి. అలాంటప్పుడు ఇందులో లోకేశ్ గొప్పదనం ఏమిటో పార్టీ శ్రేణులెవరికీ అర్థంకాలేదు. ఏదో ఒక కొత్త పదం వాడాలి కాబట్టి శాసనాలు అనే పదం వాడినట్లు కనబడుతోంది తప్ప అందులో కొత్త అర్థంకానీ, కొత్త విషయం కానీ లేదని వారంటున్నారు.
లోకేశ్ కోసం డిమాండ్ల డ్రామా..
మరోవైపు.. లోకేశ్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలని పలువురు నేతలు అదే పనిగా డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వంలో అర్జెంటుగా తనకు ఉన్నత పదవి కావాలని కోరుకుంటున్న లోకేశ్ అది కుదరకపోవడంతో తెలంగాణలో కేటీఆర్ తరహాలో ఇక్కడ తాను వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి తీసుకుంటారని సీనియర్ నేతలు చెబుతున్నారు. అంటే.. ఆయన పదవి వ్యవహారం ఎప్పుడో నిర్ణయమైపోయింది. కానీ, ఇప్పుడు అందరి ఆమోదంతో దాన్ని ఇచ్చినట్లు చూపించాలి కనుక సీనియర్ నాయకులతో ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని డిమాండ్లు చేయించారు. సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, ధూళిపాళ నరేంద్ర, పయ్యావుల కేశవ్ వంటి వారిని లోకేశ్ దూరం పెట్టడంతో వారు ఆయన్ను ఎలాగైనా ప్రసన్నం చేసుకునేందుకు మహానాడులో ఆయనకు అనుకూలంగా డిమాండ్లు చేసినట్లు కనబడుతోంది. మరోవైపు.. మహానాడులో అడుగడుగునా లోకేశ్ ఫొటోలను అత్యంత ప్రాధాన్యంగా ముద్రించారు.
రామ్మోహన్తో రాజకీయ తీర్మానం.. యనమలకు ఝలక్..
చివరిగా.. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడితో రాజకీయ తీర్మానం చేయించారు. రాజకీయ తీర్మానాన్ని ఎప్పుడూ సీనియర్ నేతతో చేయించడం ఆనవాయితీ. గతంలో యనమల రామకృష్ణుడు ఈ తీర్మానాన్ని ప్రతిపాదించే వారు. కానీ, ఇప్పుడు రామ్మోహన్తో ఈ తీర్మానం చేయించి సీనియర్ల అవసరంలేదని చెప్పకనే చెప్పారు.
తేలిపోయిన తీర్మానాలు..
ఇక రెండో రోజు రాజకీయ తీర్మానం సహా 15 అంశాలపై తీర్మానాలు చేసినా వాటిలో ఏమాత్రం పస లేకుండాపోయింది. వీటిలో ఒక్కటి తెలంగాణ తీర్మానం ఉండగా మిగిలినవన్నీ ఏపీకి సంబంధించినవే. తెలుగుజాతి–విశ్వఖ్యాతి, రాష్ట్రం–విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు అడుగులు, రాష్ట్రాభివృద్ధి కేంద్ర సహకారం, అభివృద్ధి వికేంద్రకరణ, ఉత్తరాంధ్ర అభివృద్ధి, రాయలసీమ అభివృద్ధి–రాయలసీమ డిక్లరేషన్, అమరావతి అభివృద్ధి వికేంద్రీకరణ, యోగాంధ్రప్రదేశ్, మౌలిక సదుపాయాల కల్పనతో మారనున్న రాష్ట్ర ముఖచిత్రం, రహదారులు, పోర్టులు, ఎయిర్పోర్టు అభివృద్ధి, విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు, సమగ్ర సాగనీటి ప్రణాళికతో ఉజ్వల ప్రగతి వంటి తీర్మానాలు చేసి వాటిపై అసత్యాలు, మాయమాటలు చెబుతూ నేతలు ప్రసంగించారు.