సాక్షి, విజయవాడ: గత నాలుగు రోజులుగా డీఎస్సీపై ప్రభుత్వం చర్చకు రాలేదని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. గురువారం ఆయన శాసనమండలి మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. డీఎస్సీలో అవకతవకలున్నాయనే మేం విచారణ జరిపించాలని కోరాం. మార్కెట్లో వస్తువుల్లా ఉద్యోగాలు అమ్ముకున్నారు. డీఎస్సీలో అవకతవకలు జరిగింది వాస్తవం.. అందుకే ప్రభుత్వం తోకముడిచింది’’ అని బొత్స పేర్కొన్నారు.
‘‘డీఎస్సీతో పాటు గ్రూప్-1 పైన కూడా సీబీఐ విచారణ జరిపించండి. 1998 డీఎస్సీలో 5887 మందికి ఉద్యోగాలిచ్చింది మేమే. 2008 డీఎస్సీలో 2193 మందికి ఉద్యోగాలిచ్చింది కూడా మేమే. 2019లో స్పెషల్ డీఎస్సీ నిర్వహించి 521 మందికి ఉద్యోగాలిచ్చాం. 1250 మంది కేజీబీవీ టీచర్లకు ఉద్యోగాలు కల్పించాం. మార్కెట్లో ఉద్యోగాలు అమ్ముకుని అండపిండ బ్రహ్మాండం బద్దలైపోయినట్లు డాంబికం ఎందుకు?. ఈ ప్రభుత్వం పనైపోయింది. రెండేళ్లలోనే ప్రభుత్వం మోసం తెలిసిపోయింది
..మాట్లాడితే సవాళ్లు విసురుతారు.. చర్చకు రమ్మంటే రారు. ప్రజల సమస్యల పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే సభలో చర్చించాలని కోరాం. మీలా ప్రతిదీ రాజకీయ కోణంలో మేం చూడలేం. మా ఇంటికొస్తే మీరు ఏం తెస్తారు.. మీ ఇంటికొస్తే మాకేమిస్తారు అనేలా ఉంది ప్రభుత్వం తీరు. రెండేళ్లలోనే లక్ష మంది విద్యార్థులు ఎందుకు తగ్గారు?. విద్యావ్యవస్థలో లోపం ఉంది కాబట్టే ప్రైవేట్కు తరలిపోయారు.
..విద్యావ్యవస్థను బలోపేతం చేసింది వైఎస్ జగన్. నాడు నేడు పెట్టి స్కూల్స్ రూపురేఖలు మార్చింది వైఎస్ జగన్. ఐబీ వంటి సిలబస్లు పెట్టి విద్యా ప్రమాణాలు పెంచింది వైఎస్ జగన్. జగన్ గోరుముద్ద ద్వారా మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారం అందించాం. వైఎస్ జగన్ అమ్మ ఒడిని సక్రమంగా అమలు చేశారు’’ అని బొత్స వివరించారు.


